ప్రస్తుత సమాజంలో మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ మాత్రం మార్పు రావడం లేదు. వావి వరసలు మరిచి కొందరు మృగాలు మహిళపై ఎలా ప్రవర్తిస్తున్నారో మనం రోజూ చూస్తేనే ఉన్నాం. ఎంత అప్రమత్తంగా ఉంటున్నా ఎక్కడోకక్కడ ఇలాంటి సంగటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఓ మహిళా వీఆర్ఏపై మండల మేజిస్ట్రేట్ అసభ్యంగా ప్రవర్తించడానే ఆరోపణలు కురిచేడులో సోమవారం చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ డీవీబీ వరకుమార్, తనను లైంగికంగా వేధిస్తున్నారని మండల పరిధిలోని పడమర వీరాయపాలెం గ్రామానికి చెందిన వీఆర్ఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలిసిన సమాచారం మేరకు.. గత నెల 25న క్రిస్మస్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలోని సహోద్యోగులను విందు నిమిత్తం వీఆర్ఏ తన ఇంటికి ఆహ్వానించింది. సిబ్బంది అందరూ వెళ్లగా, వరకుమార్ మాత్రం వెళ్లలేదు. ఈ క్రమంలోనే గత శనివారం నాడు, తాను విందుకు రాలేదని గుర్తు చేసిన ఆయన, ఒంటరిగా విందు ఇవ్వాలని కోరారు. విందులో కోడికూరతో పాటు నువ్వూ కావాలని చెప్పాడట.
తండ్రి వంటి వారు ఇలా అనడం సరికాదని ఆమె చెబుతున్నా వినకుండా, వెనక నుంచి వచ్చి కౌగిలించుకుని అసభ్యకరంగా మాట్లాడారని ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో తహసీల్దార్ను దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అయితే తనపై వీఆర్ఏ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వరకుమార్ వివరణ ఇచ్చారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను తేల్చాలని డిమాండ్ చేయడం గమనార్హం.