టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఒకవైపు సినిమా రంగంలోబిజీ గా ఉంటూనే రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో బాలయ్య హిందూపూర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. కరోనా సమయంలో హైదరాబాద్ లోనే ఉన్న బాలయ్య ఈరోజు హిందూపూర్ నియోజక వర్గంలోకి అడుగుపెట్టారు. హిందూపూర్ వెళ్లిన బాలయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అంతేకాదు, గతంలో హిందూపూర్ కోవిడ్ ఆసుపత్రికోసం రూ. 55 లక్షల సొంత నిధులతో కొవిడ్ 19 పరికరాలను కొనుగోలు చేసి అందిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. మాట ఇచ్చినట్టుగానే బాలయ్య ఈరోజు హిందూపూర్ ఆసుపత్రికి కొవిడ్ కిట్స్ ను అందించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో, అభిమానులతో మాట్లాడారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతుందని, ఆత్మస్థయిర్యంతో పోరాటం చేస్తున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని చెప్పిన బాలయ్య, భారతదేశం గొప్పదనం, భారతదేశంలోని ఇతిహాసాలు, మంత్రాల గురించి చెప్పుకొచ్చారు. పురాణంలోని ఓ మంత్రం గురించి ప్రస్తావించిన బాలయ్య, ఆ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనలో ధైర్యం పెరుగుతుందని, కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని అంటున్నారు బాలయ్య. బాలయ్య చెప్పినట్టుగా మంత్రాలకు కరోనా తగ్గిపోతే ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని మంత్రాలు వల్లిస్తే సరిపోతుంది కదా. బాలయ్య మంత్రాలపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.