మాజీ మిస్  వరల్డ్  పాన్  ఇండియా  హీరోయిన్ ఐశ్వర్యారాయ్ 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. మెరుపుతీగెలాంటి అందంతో ఐశ్వర్యారాయ్ యాడ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసి ఇప్పటికీ కూడా దూసుకుపోతుంది.‘మిస్ ఇండియా’ టైటిల్ పోటీలో రన్నరప్ గానే నిలచింది. అయినా, తన అందంపై నమ్మకంతో మళ్ళీ అందాలపోటీల్లో సాగింది. 1994 మిస్ వరల్డ్ గా ఐశ్వర్య నిలచింది. చిత్రమేమిటంటే, మిస్ యూనివర్స్ గా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ కు సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, సరైన చిత్రంతో ముందుకు సాగాలని ఆమె ఆశించారు. ఆ సమయంలోనే మణిరత్నం ‘ఇరువర్’ తెరకెక్కిస్తూ అందులో నాయికగా ఐశ్వర్యను ఎంచుకున్నారు. తొలి చిత్రంలో రెండు విభిన్న పాత్రలను పోషించి భళా అనిపించింది ఐశ్వర్య. ఆ సినిమా పరాజయం పాలయింది. హిందీలో నటించిన తొలి చిత్రం ‘ఔర్ ప్యార్ హోగయా’ కూడా ఐశ్వర్య అందం మెరుపులకు తగ్గ విజయాన్ని అందించలేకపోయింది.ఆ సమయంలో శంకర్ తన ‘జీన్స్’లో ఐశ్వర్యారాయ్ తో వైవిధ్యమైన పాత్రను పోషింప చేశారు. ‘జీన్స్’ ఘనవిజయంతో ఐశ్వర్యారాయ్ అందం దేశావ్యాప్తంగా చిందులు వేసింది. ఆమె డేట్స్ కోసం డైరెక్టర్ లు నిర్మాతలు క్యూ కట్టడం మొదలయింది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో రూపొందిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా ఐశ్వర్యను మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. ఆ చిత్రంలో ఐశ్వర్య ధరించిన దుస్తులను చూడటం కోసం అమ్మాయిలు పరుగులు తీశారు.


యువకులు ఆ ప్రేమకథా చిత్రాన్ని వీక్షించి, పులకించి, ఐశ్వర్యను తమ స్వప్నసుందరిగా పట్టాభిషేకం చేసుకున్నారు. తెలుగు చిత్రం ‘రావోయి చందమామ’లో నాగార్జునతో కలసి “లవ్ టు లివ్…” అనే పాటలో నర్తించి మురిపించింది ఐసు. ఈ పాట కోసం అప్పట్లో ఆమె భారీ పారితోషికం అందుకుందని చెప్పేవారు. ఇక ఈ పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు రోజులు చిత్రీకరణ జరుపుకోగా, అన్ని రోజులూ ఆమెను చూడటానికి సినీజనమే క్యూ కట్టడం చూస్తే, తెలుగునాట ఆమెకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో పూర్తిగా అర్థమయింది. “తాళ్, మేలా, జోష్, హమారే దిల్ ఆప్కే పాస్ హై, మొహబ్బతే, దేవ్ దాస్, ఖాకీ, క్యు హోగయా నా, ధూమ్ -2, జోధా అక్బర్, సర్కార్ రాజ్, గుజారిష్, యే దిల్ హై ముష్కిల్” వంటి హిందీ చిత్రాలలో ఐశ్వర్యారాయ్ అందాలతో బంధాలు వేసింది. అభినయంతోనూ కట్టి పడేసింది. తమిళంలో ఆమె నటించిన ‘యందిరన్’ తెలుగులో ‘రోబో’గా ఘనవిజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తో కలసి ‘బంటీ ఔర్ బబ్లీ’లో “కజ్రారే…” సాంగ్ లో ఐశ్వర్యారాయ్ అందాలతో చేసిన కనువిందును ఎవరూ మరచిపోలేరు.


భర్త అభిషేక్ తో కలసి ఆమె నటించిన మణిరత్నం ‘గురు’ సైతం ఆకట్టుకుంది. “బ్రైడ్ అండ్ ప్రెజుడైస్, ద మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్, ద లాస్ట్ లెజియన్, ద పింక్ పాంథర్-2” వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ఐశ్వర్య తన అందాల అభినయంతో మురిపించింది. ఆ మధ్య వచ్చిన ‘యే దిల్ హై ముష్కిల్’లో ఐశ్వర్య అందం చూసి, పెళ్ళయ్యాక ఆమెలో మరింత ఆకర్షణ పెరిగిందని అన్నారు జనం. ప్రస్తుతం ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా ఐశ్వర్య మునుపటిలా  ఆకర్షిస్తూనే ఉంది.తన అభిమాన దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో నందినిగా, ఊమై రాణిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం అలరించింది. మళ్ళీ తానున్నాంటూ యవ నటిమణులకు సందేహం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: