రాజకీయ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్‌ దుషారా విజయన్‌. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్‌ దృష్టిలో పడ్డారు. అలా ఆయన నిర్వహించిన ఆడిషన్‌లో సెలెక్ట్‌ అయ్యి సార్పట్టా పరంపరై చిత్రంలో కథానాయకగా నటించారు. అందులో నటుడు ఆర్యకు జంటగా మరియమ్మ అనే పాత్రను పోషించారు. ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి యువతగా ఆ పాత్రకు జీవం పోసి అందరి ప్రశంసలను అందుకున్నారు.

ఆ తర్వాత దర్శకుడు పా.రంజిత్‌నే రూపొందించిన నక్షత్రం నగర్గిరదు చిత్రంలోని నటించారు. ప్రస్తుతం కళువేత్తి మూర్కన్, అవినీతి, నటుడు అర్జున్‌దాస్‌ సరసన ఒక చిత్రం అంటూ మూడు, నాలుగు చిత్రాలు దుషారా చేతిలో ఉన్నాయి. వీటిలో అరుళ్‌ నిధికి జంటగా నటించిన కళువేత్తి మూర్కన్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26వ తేదీన తెరపైకి రావడానికి  సిద్ధమవుతోంది. ఎస్‌.అంబేత్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నటి దుషారా విజయన్‌ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ కళువేత్తి మూర్కన్‌ తనకు స్పెషల్‌ చిత్రమని పేర్కొన్నారు. నటుడు అరుళ్‌ నిధితో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అయితే ఆయన సెట్‌లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని అన్నారు. తాను ఇందులో కవిత అనే బ్యాంక్‌ ఉద్యోగి పాత్రలో నటించినట్లు చెప్పారు.

చిత్రంలో అరుళ్‌ నిధితో కలిసి నటించిన రొమాన్స్‌ సన్నివేశాలు డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. దర్శకుడు పా..రంజిత్‌ సార్పట్టా పరంపరైకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందనీ అదే జరిగితే అందులో తానే నటిస్తానని చెప్పారు. తాను నట జీవితం సార్పట్టా పరంపరై చిత్రంలోని మరియమ్మ పాత్రకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా మారిందన్నారు. తెలుగు చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉందనీ అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: