తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి చేరిన చాలా మంది బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎందురు చూస్తుంటారు. గతంలో స్టార్ హీరోలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అయితే మధ్యలో చాలా కాలం పాటు స్టార్ హీరోలు బాలీవుడ్కు దూరంగా ఉన్నా.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నారు సౌత్ హీరోలు. హీరోలు మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
అయితే ఇప్పటికే బాలీవుడ్ లోనూ ప్రూవ్ చేసుకున్నాడు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అది కూడా ఆశామాషీ హీరోతో కాదు. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ నే డైరెక్ట్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు పూరి. అమితాబ్ బచ్చన్ హీరోగా 2011లో రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా బుడ్డా హోగా తెరా బాప్. ఈ సినిమాతో అమితాబ్ ఇమేజ్నే మార్చేశాడు పూరి. అప్పటి వరకు తండ్రి పాత్రలు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేస్తున్న అమితాబ్ మరోసారి యాంగ్రీ హీరో పాత్రలో కనిపించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో అమితాబ్ లీడ్ రోల్స్ ఇవ్వటం ప్రారంభించారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఆ స్థాయిలో అమితాబ్ ఇమేజ్ మార్చేశాడు పూరి.
అయితే ఈ అవకాశం పూరికి రావటం వెనుక పెద్ద కథే ఉంది. టాలీవుడ్లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న పూరికి ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ ద్వారా ఈ అవకాశం వచ్చింది. బిగ్ బీ కి అత్యంత సన్నిహితుడైన వర్మ, పూరితో మంచి కథ ఉంటే చెప్పు అమితాబ్ డేట్స్ ఇప్పిస్తా అంటూ మాట ఇచ్చాడట. దీంతో వెంటనే ఓ సూపర్ యాక్షన్ కథను సిద్ధం చేసిన పూరి సింగిల్ సిట్టింగ్లో బిగ్ బీతో ఒకే చేయించుకున్నాడు. ఈ సినిమాలో అభితాబ్ ను చూసిన ఫ్యాన్స్ మరోసారి ఫుల్ ఖుషీ అయ్యారు.