సింగర్ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిజిటల్ మీడియా మ్యాంగో సంస్థ అధినేత రామ్ వీరపనేనితో శంషాబాద్‌లోని ఓ గుడిలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు సనీ నటులు నితిన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. రెండో వివాహం చేసుకున్నాక సింగర్ సునీతకు సినీ ఇండస్ట్రీ పెద్దలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూడా సునీత, రామ్ వీరపనేనికి శుభాకాంక్షలు చెప్పారు.

ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన నాగ బాబు వీరిద్దరికి అభినందనలు తెలిపారు. ఈ ఫొటోలో ఆయన ఏం రాసుకొచ్చారంటే.. ఆనందం అనేది మన పుట్టుకతో వచ్చేది కాదు.. ఆనందం అనేది మనం వెతుక్కునేది, సాధించుకునేది. మీరిద్దరూ ఒకరిలో ఒకరు ఆనందాన్ని వెతుక్కున్నందుకు మీరిద్దరికి అభినందనలు. మీరిద్దరూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. చాలా మంది ఇటువంటి నిర్ణయం తీసుకునేందుకు ఎంతో ఆందోళన చెందుతుంటారు. సమాజం ఏమనుకుంటుందోననే భయంతో ఉంటారు. అలాంటి వారందరికి మీరు ప్రేరణగా ఉన్నారు. ఆనందం, ప్రేమ అనేవి మీతో జీవితాంతం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరిద్దరికి హ్యాపి మ్యారీడ్ లైఫ్’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు.

కాగా.. సింగర్ సునీత రెండో వివాహంపై నెట్టింట్లో విమర్శలు కూడా చేసేవారు లేకపోలేదు. పెళ్లి వయసున్న పిల్లలను పెట్టుకుని ఈమె మళ్లీ పెళ్లి చేసుకోవడమేంటంటూ కొంత మంది సునీతపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఎవరి జీవితం వారి ఇష్టమని, వారి జీవితంలోకి వెళ్లి విమర్శలు చేసే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికి ఈ వయసులో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు వివాహం చేసుకున్న వీరిద్దరూ కలకలం ఆనందంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: