దేశంలో ఇప్పుడు కరోనా పేరు చెప్పినా.. ఆ వ్యాధితో బాధపడుతున్నా ఎంత దీనంగా చూస్తున్నారో ప్రతిరోజూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం.. ప్రత్యక్షం చూస్తూనే ఉన్నాం. ఈ కరోనా సమయంలో నిరుపేదల కష్టాలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. అలాంటి వారికి అండగా ఉండేందుకు.. పలువురు మానవతావాదులు ముందుకొచ్చారు. ఇప్పటికే పలువురు సినీ నటులు, వ్యాపారవేత్తలు తమ దాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలిసందే. తాజాగా ఓ చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన కార్తీక్ కు భార్య, ఐదేళ్ల కూతురు ఉన్నారు. బిడ్డకు పుట్టుకతోనే గుండె జబ్బు వచ్చింది.
ఇప్పుడు ఆమెకు ఐదేళ్లు. ఇటీవల కరోనా ఇబ్బందులు ఆ కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఉద్యోగం పోయింది.. తల్లి ఇంటి పట్టునే ఉంటుంది.. దాంతో ఆ చిన్నారికి ఆపరేషన్ ఎలా అని బాధపడుతున్నారు. ఆ సమయంలో ఆపద్భందువు లా ఓ కానిస్టేబుల్ ముందుకు వచ్చాడు. నందబక్కం పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పీ సెంథిల్ కుమార్, ఆయన భార్య కలిసి ఆంజియోగ్రామ్ చికిత్స కోసం రూ. 30 వేలు విరాళంగా ఇచ్చారు కార్తీక్ కు. సెంథిల్ కుమార్, ఎస్ఐ తంగరాజ్ విజ్ఞప్తి మేరకు మిగతా ఉద్యోగులందరూ రూ. 45 వేలు జమ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రూ. 1.25 లక్షలు, ఇతర దాతల నుంచి మరో రూ. 3 లక్షలు జమ చేసి కార్తీక్ కు ఎస్ఐ తంగరాజ్, సెంథిల్ కుమార్ అందజేశారు.
అంతా జమచేసి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కవిష్కాకు నెల రోజుల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాడు. ఈ సర్జరీ ఏడు గంటల పాటు కొనసాగింది. పదిహేను రోజుల పాటు ఐసీయూలో, మరో 15 రోజుల పాటు జనరల్ వార్డులో కవిష్కా ఉన్నది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత జులై 11న డిశ్చార్జి చేశారు. ఇప్పుడు ఆ చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది.. అందరూ ఆ కానిస్టేబుల్ మంచితనానికి హ్యాట్సాప్ చెబుతున్నారు.