దేశంలో మార్చి నెల నుంచి కరోనా కేసుల ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. అప్పటి నుంచి దాదాపు రెండు నెలల వరకు లాక్ డౌన్ చాలా సీరియస్ గా చేశారు.. జనాలు బయటకు వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల కోసం తప్ప ఎవరూ బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పేద ప్రజలు, వలస కార్మికులు, చిరుద్యోగులు, వ్యాపారస్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ కరోనా ని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ పాటించక తప్పదని ప్రభుత్వాలు ప్రజలకు విన్నవించుకున్నాయి. ఈ మద్య లాక్ డౌన్ సడలించారు.. దాంతో మళ్లీ కేసులు తిరగబడుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధానిగా విరాజిల్లుతున్న ముంబాయి కరోనా కోరల్లో చిక్కుకుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ముంబాయికి మరో ఉపద్రవం ముంచుకు వచ్చింది. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై వాసులకు తాజాగా వాతావరణ శాఖ చేసిన మరో హెచ్చరిక భయభ్రాంతులకు గురిచేస్తోంది.
రాగల 48 గంటల్లో ముంబైతోపాటు సమీప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. బాండ్రా కుర్లా కాంప్లెక్సులో 201 మిల్లీమీటర్లు, కొలాబాలో 152 మిల్లీమీటర్లు, శాంతాక్రజ్ లో 159.7 మిల్లీమీటర్లు, మహాలక్ష్మి ప్రాంతంలో 129 మిల్లీమీటర్లు, రాంమందిర్ ప్రాంతంలో 130మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. భారీవర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని, సముద్ర తీరప్రాంతాలకు వెళ్లవద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు.