గాల్వాన్ లోయ ఘటన తరువాత ఇండియా, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  రెండు దేశాలు నువ్వా నేనా అన్నట్టుగా బలగాలను లడఖ్ సరిహద్దుల్లో మోహరిస్తున్నాయి.  ఒకవైపు డ్రాగన్ పదాతి దళాల స్థాయి అధికారుల చర్చలు జరుపుతూనే మరోవైపు సైలెంట్ గా బోర్డర్ లో ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.  అటు ఇండియా సైతం ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.  డ్రాగన్ కు పోటీగా ఇండియా అన్నింటికీ తెగించి రెడీగా ఉన్నది.  

త్రివిధదళాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి.  రఫెల్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక బలం మరింతగా పెరిగింది.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానాలను ఇప్పటికే లడఖ్, అస్సాం బోర్డర్ లోని ఎయిర్ బేస్ లో ఇండియా మోహరించింది.  మరోవైపు రాడార్ లతో నిరంతరం పహారా కాస్తున్నారు.  డ్రోన్ సహాయంతో ఫింగర్ పాయింట్ల వద్ద డ్రాగన్ కదలికలను గుర్తిస్తున్నారు.  

ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఇండియా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు చిన్న చిన్న దేశాలను బెదిరించి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం ఆధిపత్యం సంపాదించింది.  సముద్రంలోని అమూల్యమైన సహజ సంపదపై కన్నేసింది.  దీంతో ఇండియా చైనాను దారిలోకి తీసుకొచ్చేందుకు సైలెంట్ గా యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది.  

ఇండియా తీసుకున్న ఈ అనూహ్యమైన నిర్ణయానికి చైనా షాక్ అయ్యింది.  ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఇండియా యుద్ధ నౌకలను మోహరించింది.  అటు అమెరికా సైతం యుద్ధ నౌకలను మోహరించడంతో చైనా అడుగు ముందుకు వేయలేకపోతున్నది.  దీంతో చైనా తూర్పు లడఖ్ లోని ప్యాంగ్ యాంగ్ సరస్సు వద్ద నియమాలను ఉల్లఘించి దురాక్రమణ చేసేందుకు ప్రయత్నం చేసింది.  అయితే, ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులను అడ్డుకున్నారు.  రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. డ్రాగన్ ఎలాంటి ఎత్తుగడలు వేసినా అడ్డుకొని తీరతామని ఇండియా హెచ్చరించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: