ఇక ఉక్రెయిన్ నుంచి పోలెండ్ బోర్డర్ లోకి వచ్చే ఇండియన్స్ కు వీసాలు అవసరం లేదని ఆ దేశం చెబుతున్నప్పటికీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులను కాళ్లతో తన్నుతూ హింసిస్తున్నారు. ఆడవాళ్లు కాళ్లు మొక్కాలనీ.. మగవాళ్లు తాము చెప్పినట్టు వింటేనే రానిస్తామంటూ షరతులు పెడుతున్నారు. కేరళకు చెందిన ఓ విద్యార్థి అక్కడి పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రష్యా యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 3.68లక్షల మంది వలస వెళ్లినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. వీరంతా పోలండ్, హంగేరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్టు పేర్కొంది. పోలండ్ సరిహద్దుల్లో 14కిలోమీటర్ల పొడవైన క్యూ ఉందని చెప్పింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారనీ.. ఎముకలు కొరికే చలిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని గ్యాస్, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. కార్కివ్ లోని గ్యాస్ పైప్ లైన్ ను రష్యా సైనికులు పేల్చేశారు. ఉక్రెయిన్ బలగాలు మాత్రం రష్యా దాడులను తిప్పికొడుతున్నాయి. కీవ్ లోకి ప్రవేశించకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.