సీనియర్ టీడీపీ నాయకుడు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన నేత అశోక్ గజపతి రాజుకు పార్టీలో పరాభవం ఎదురవుతోందా? ఆయనను వదిలించుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారా? ఈ నేపథ్యంలోనే అశోక్కు ప్రాధాన్యం కూడాతగ్గిపోతోందా? అంటే ఔననే అంటున్నాయి విజయనగరం టీడీపీ వర్గాలు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల విజయనగరం జిల్లా టీడీపీలో భారీ మార్పు చోటు చేసుకుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిని నియమించారు చంద్రబాబు.
అయితే, ఇంత కీలక వ్యవహారంపై ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, కేంద్రంలో మంత్రి అశోక్ గజపతికి బాబు మాటమాత్రంగానైనా చెప్పలేదట. అదేవిధంగా వైసీపీ నుంచి జంప్ చేసి వచ్చిన సుజయ కృష్ణరంగారావును మంత్రిని చేయడం కూడా అశోక్కు నచ్చడం లేదు. పైగా ఈ విషయంలోనూ తనకు మాట మాత్రం తెలియలేదట. దీంతో అశోక్ మానసికంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరోపక్క, విజయనగరం డివిజన్లో మంత్రి గంటా శ్రీనివాసరావు పెత్తనం ఎక్కువైంది. ఈ పరిణామం అశోక్కు మరింత తలనొప్పిగా మారింది.
ఇక, అశోక్కు తన సొంత విషయంలోనూ అధినేత చంద్రబాబు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్టు తెలుస్తోంది. తన కుమార్తె అదితిని వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయించాలని అశోక్ భావిస్తున్నారు. ఈ విషయంపైనే ఆమెను ఇటీవల కాలంలో అధికారిక కార్యక్రమాల్లో తిప్పుతున్నారు. ఇటీవల కాలంలో అధితిని పార్లమెంటుకు పంపించడం ఆయన ప్రధాన ఎజెండాగా మారిపోయింది. దీంతో ఇటీవల జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలోనే అదితిని వేదికపైకి ఎక్కించారు అశోక్. అయితే, ఏ అధికారంతో ఆమె వేదికను పంచుకున్నారని బాబు ఆఫ్ది రికార్డుగా అశోక్కు క్లాస్ పీకారట.
ఈ పరిణామంతో నిర్ఘాంత పోయిన అశోక్.. అసలు తనకు పార్టీలో ఎందుకింత అవమానం జరుగుతోందని తన అనుచరుల వద్ద వాపోయారట. తాను ఏళ్లకు ఏళ్లుగా పార్టీకి సేవచేస్తున్నానని, ప్రజలకోసం కష్టపడుతున్నానని అశోక్ చెబుతున్నారట. అయినా తనకు ఎందుకు ఇలా పొగబెడుతున్నారని ఆయన వాపోతున్నారట. ఇక, టీడీపీ అధినేత వాయిస్ మరోలా ఉంది. కోరి కేంద్ర మంత్రి పదవి ఇప్పించినా.. అశోక్ ఏపీకి చేస్తోంది ఏమీ లేదని, ప్రతి విషయాన్నీ తానే ఢిల్లీకి వెళ్లి పరిష్కరించుకోవాల్సి వస్తోందని బాబు అంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏపీకి దక్కడంలో అశోక్ అనుకున్న విధంగా కష్టపడలేదని బాబు భావిస్తున్నారు.
దీనికితోడు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమాన సంస్థతో గొడవకు దిగినప్పుడు కూడా `అరె.. మన పార్టీ ఎంపీయే కదా!` అన్న ధోరణిని ప్రదర్శించి.. రగడను మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేయకపోగా.. ఎంపీలు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే అంటూ అశోక్ కామెంట్ చేయడంపైగా బాబు గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత ఈ విషయంతో సంబంధం లేని సుజనా చౌదరిని రంగంలోకి దింపి సమస్యను పరిష్కరించాల్సి వచ్చిందని బాబు భావిస్తున్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లోనూ అశోక్ చురుగ్గా పాల్గొనడం లేదు. ఆయా విషయాల నేపథ్యంలోనే బాబు ఒకింత అసహనంగా ఉన్నట్టు సమాచారం. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.