మొత్తానికి చంద్రబాబునాయుడు అసలు విషయాన్ని చెప్పేశారు. మదనపల్లిలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మాట్లాడుతూ, ఇంకా ఎన్డీఏలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో ముణిగిపోతామన్న ఉద్దేశ్యంతోనే బిజెపితో తెగతెంపులు చేసుకున్నట్లు అంగీకరించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతలైనా, ఇతర పార్టీల నేతలైనా మొదటి నుండి చెబుతున్నదదే. నాలుగేళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు రాష్ట్రానికి సాధించిందేమీ లేదనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విభజన చట్టంలోని హామీల అమలు కావచ్చు, స్వయంగా తానే ఇచ్చిన హామీల అమలులో కావచ్చు చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు.
హామీల అమలులో ఫెయిల్
అధికారం అందుకోవటమే ఏకైక లక్ష్యంగా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చారు. అందులో ప్రధానమైన రుణమాఫీ, కాపులను బిసిల్లో, బోయలను ఎస్టీల్లో చేర్చటం, నిరుద్యోగ భృతి ఇవ్వటం, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం లాంటి అనేక హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు. అదే సమయంలో ప్రాజెక్టుల అమలులో అవినితీ విచ్చలవిడిగా పెరిగిపోయిందనే ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఇక, శాంతి భద్రతల సమస్య గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళినా ఉపయోగం లేదని అంటున్నారు కానీ అసలు ఎందుకు వెళ్ళారో మాత్రం ఎవరికీ తెలీదు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడి అసలు చంద్రబాబుకు అపాయిట్మెంట్ ఇవ్వలేదంటేనే అర్ధమైపోతోంది సీన్.
వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా ?
ఎన్డీఏలో ఉన్నంత కాలం వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా చంద్రబాబు వ్యవహరించినట్లు ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. ఐదవ బడ్జెట్లో కూడా ఏపికి కేంద్రం ఏమీ ఇవ్వకపోయేటప్పటికి ఆ ముసుగులో చంద్రబాబు బయటకు వచ్చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఇపుడు బిజెపితో యుద్ధం అంటూ నాటకాలు ఆడుతున్నట్లు వైసిపి ఆరోపిస్తోంది. తాజాగా చంద్రబాబు చెప్పిన మాటలు కూడా వైసిపి ఆరోపణలనే నిజం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపిలో ఎటూ బిజెపి ముణగటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే, వారికున్నదీ లేదు పోయేదీ లేదు. బిజెపికి నాలుగు సీట్లు వచ్చినా లాభమే. అదే చంద్రబాబు పరిస్దితి అది కాదు. అధికారంలో లేకపోతే చంద్రబాబుకు నిద్ర పట్టదు. అందుకనే జనాల మూడ్ ను గ్రహించే బిజెపితో కటీఫ్ చెప్పేశారు. నిజంగానే జనాలకు బిజెపిపై అంత కోపముంటే మరి నాలుగేళ్ళు బిజెపితో అంటకాగినందుకు అదే కోపం చంద్రబాబు మీదుండదా ?