రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం అక్కరకు రాలేదు. చాణుక్యుడని తెచ్చుకున్న పేరు ఉత్తదే అని తేలిపోయింది. ఇదంతా ఎవరిగురించని అనుకుంటున్నారా ? ఈపాటికే అర్ధమైపోయుంటుంది చంద్రబాబునాయుడు గురించే అని. ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వంపై లోక్ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా చంద్రబాబు బండారాన్ని మోడి బట్టబయలు చేశారు. ప్రత్యేకహోదా స్ధానంలో ప్రత్యేక ప్యాకేజిని చంద్రబాబు స్వాగతించిన తర్వాతే తాము ప్యాకేజిని ప్రకటించామని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు నైజాన్ని పూర్తిగా మోడి సభ సాక్షిగా ఎండగట్టారు.
బిజెపి,టిడిపిలు కలిసే మోసం
నిజానికి గడచిన నాలుగేళ్ళుగా ఏపి జనాలను ఇటు టిడిపి అటు బిజెపి కలిసే మోసం చేస్తున్నాయనటంలో సందేహం లేదు. మొదటి నుండి ప్రత్యేకహోదా పై పోరాటం చేస్తున్నది కేవలం వైసిపి మాత్రమే. హోదా పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సదస్సులు పెట్టారు. ఎన్నో ఆందోళనలు చేశారు. అప్పట్లో ఆందోళనలను, సదస్సులను అణిచివేయటానికి చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. అయితే, చంద్రబాబు అణిచేసే కొద్ది ప్రత్యేకహోదా అన్నదిత జనాల్లో ఒక సెంటిమెంటుగా మారిపోయింది.
యు టర్న్ తీసుకున్న చంద్రబాబు
ఎప్పుడైతే హోదాపై జనాల మనోభావాలను గ్రహించారో అప్పుడే చంద్రబాబుకు 2019 ఎన్నికలు గుర్తుకువచ్చాయి. బిజెపి,టిడిపిలపై జనాల ఆగ్రహాన్ని గ్రహించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటమే మార్గమని అనుకున్నారు. హటాత్తుగా ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. రావటం రావటమే హోదాపై యు టర్న్ తీసుకున్నారు. అనేక అంశాలపై కేంద్రంపై ధ్వజమెత్తటం మొదలుపెట్టారు. అంటే నాలుగేళ్ళల్లో ఏపి అభివృద్ధి కాకపోవటానికి, హోదా రాకపోవటానికి బిజెపినే కారణమంటూ దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టారు. పనిలో పనిగా బిజెపి, వైసిపి ఒకటే అంటూ తన మీడియాతో ప్రచారం చేయించటం మొదలుపెట్టారు.
బిజెపి వ్యూహాత్మకం
వీటన్నింటికీ పరాకాష్టగా లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బిజెపి జాతీయ నాయకత్వం చంద్రబాబు ప్రచారానికి అడ్డు కట్టవేయాలని నిర్ణయించుకున్నది. ఆ సమయంలోనే అవిశ్వాస తీర్మానం నోటీసు అంది వచ్చింది. వెంటనే బిజెపి ముఖ్యులు వ్యూహం పన్నారు. దానికి అనుగుణంగానే స్పీకర్ టిడిపి నోటీసును అడ్మిట్ చేసుకుని సమయం కేటాయించింది.
చంద్రబాబు పరువు పోయింది
బిజెపి పెద్దల వ్యూహం ప్రకారమే చర్చకు స్పీకర్ అనుమతించారు. చివరగా మాట్లాడిన మోడి ఒక్కసారిగా చంద్రబాబు పరువు మొత్తం తీసేశారు. చంద్రబాబుపై మోడి ఆ విధంగా మాట్లాడుతారని టిడిపి ఊహించలేదు. దాంతో ఎంపిలు బిత్తరపోయారు. మోడి ప్రసంగం విన్న చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బిజెపిపై తాము ఆరోపణలు చేస్తే తమపై బిజెపి ఎదురుదాడి చేయకుండా ఉంటుందా అన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబులో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి తన బండారాన్ని బయటపెట్టాలని బిజెపి అనుకుంటే సభలో టిడిపి ఎలా అడ్డుకోగలదు ?చఇవరకు జరిగిందదే. చంద్రబాబు గురించి మోడి మాట్లాడుతున్నపుడు టిడిపి ఎంపిల నోట మాట రాలేదు. బిజెపిని ఏదో చేయటం ద్వారా లబ్దిపొందాలన్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టి చివరకు సెల్ఫ్ గోలు వేసుకున్నట్లైంది.