ప్రకాశం జిల్లాలో తెలుగుదేశంపార్టీ దయనీయ పరిస్ధితులో ఉన్నట్లు కనిపిస్తోంది. లేకపోతే ఒక నేత పెట్టిన డిమాండ్లకు చంద్రబాబునాయుడు లొంగిపోయిన తీరుకు పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. టిడిపి ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పెట్టిన షరతులకు చంద్రబాబు లొంగటం వల్లే తాజాగా జిల్లా పార్టీలో చిచ్చు మొదలైంది. ఇపుడు రేగిన చిచ్చు వల్లే జిల్లాలో పార్టీ ఎంతగా బలహీనంగా ఉందో అందరికీ అర్దమైంది.
సత్తా చాటిన వైసిపి
ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపి స్ధానంలో వైసిపిని ధీటుగా ఎదుర్కొగలిగిన నేతను అభ్యర్ధిగా పోటీలోకి దింపాలని చంద్రబాబు అనుకున్నారు. అనుకున్నదే తడువుగా వెతుకులాట కూడా మొదలుపెట్టారు. అయితే, చంద్రబాబు కంటికి ఎవ్వరూ ఆనలేదు. పోయిన ఎన్నికల్లోనే ఈ జిల్లాలో వైసిపి తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. జిల్లాలోని మెజారిటీ అసెంబ్లీలతో పాటు ఒంగోలు ఎంపి స్ధానాన్ని కూడా వైసిపి గెలుచుకుంది.
చంద్రబాబును టెన్షన్ పెట్టిన మాగుంట
వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఓడించి టిడిపి సత్తా చాటాలని చంద్రబాబు అనుకున్నారు. అందులోనూ అధికారంలో ఉన్నారు కదా వివిధ మార్గాల్లో సర్వేలు కూడా చేయించారు. అయితే గట్టి అభ్యర్ధిగా ఎవరూ కనబడలేదు. అదే సమయంలో పోయిన ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి త్వరలో వైసిపికి జంప్ అయిపోతారన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో చంద్రబాబులో ఒక్కసారిగా టెన్షన్ పట్టుకుంది.
ఎంపిగా ఎవరూ ముందుకు రాలేదా ?
అందుకనే మాగుంటను పిలిపించి మాట్లాడారు. వైసిపిలోకి వెళ్ళవద్దని నచ్చ చెబుతూనే వచ్చే ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయటానికి మాగుంటను ఒప్పించారని సమాచారం. అంటే దీన్నిబట్టి అర్ధమైందేంటి ? ప్రకాశం జిల్లాలో టిడిపికి మాగుంట తప్ప వేరే దిక్కులేదని. మాగుంట గెలుపోటములను పక్కనపెడితే అధికారంలో ఉన్న పార్టీకి ఎంపి అభ్యర్ధిగా ఒక్క నేత కూడా దొరక్కపోవటం ఏంటి ? మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు ఎంతోమంది సీనియర్లున్నారు కదా ? అంటే ప్రస్తుత పరిస్దితులను దృష్టిలో పెట్టుకుని ఎంపిగా పోటీ చేయటానికి ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. దాంతో మాగుంటను బ్రతిమలాడుకుని ఒప్పించాల్సొచ్చింది. అవకాశం వచ్చింది కదా అని మాగుంట కూడా తన డిమాండ్లను చంద్రబాబు ముందు పెట్టి సాధించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ డిమాండ్లే జిల్లా పార్టీలో చిచ్చుకు కారణమైంది.