తెలంగాణాలో గట్టిపట్టు సాధించాలని భావిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ.. బద్ధ శత్రుత్వాన్ని విడనాడి కూడా కాంగ్రెస్తో జట్టుకట్టింది. మహాకూటమి పేరుతో డిసెంబరు 7న జరగనున్న ఎన్నికల్లో పాల్గొనేందుకు రంగం సిద్ధం చేసు కుంది. మొత్తం 119 స్థానాల్లో టీడీపీకి కేవలం 12 సీట్లు మాత్రమే కేటాయించినా చంద్రబాబు సర్దుకు పోయారు. అయితే, మరో ఐదారు సీట్లను డిమాండ్ చేయాలని టీ-టీడీపీ నేతలకు ఉన్నప్పటికీ.. చంద్రబాబు వ్యూహంతో వారు మౌనంగానే ఉండిపోయారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అయితే, కొన్ని నియోజకవర్గాలను కేటాయించినా.. కూడా టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం తప్ప ఎక్కడా కూడా బాబుకు బలమైన నాయకులు లేరని కాంగ్రెస్ చెబుతుండడం గమనార్హం.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో తమకు బలమైన అభ్యర్థులున్నారనీ, టీజేఎస్, సీపీఐ, టీడీపీకి ఆ స్థాయిలో అభ్యర్థులు లేరనీ, అదీగాక తాము ఒక ప్రణాళిక ప్రకారం ఆయా నియోజకవర్గాల్లో పార్టీని అభివృద్ధి చేశామని కాంగ్రెస్ పెద్దలు వాదించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ లాంటి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్న బాల్కసుమన్, దుర్గంచిన్నయ్య, కోవలక్ష్మిలాంటి బలమైన నేతలను ఢీకొనాలంటే తమ వల్లే సాధ్యమని చెప్పినట్లు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీ పోటీచేయాల్సిన అవసరం గురించి, తమ నుంచి అందిన విజ్ఞప్తులనూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార తదితరులు పరిగణలోకి తీసుకున్నట్లు పలువురు ఆశావహులు అంటున్నారు.
వాస్తవానికి సీట్ల సర్దుబాటులో భాగంగా మహాకూటమిలోని మిత్రపక్షాలకు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వబోమని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి నియోజక వర్గాలను టీజేఎస్, సీపీఐకి కేటాయించనున్నారనే వార్తలు ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహుల్లో ఆందోళన రేకెత్తించిం ది. దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ పెద్దలను ఆశ్రయించగా టీడీపీకి బలంలేని చోట ఇచ్చినా ప్రయోజనం లేదని చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో టీ-టీడీపీకి అభ్యర్థులు లేరనేవ్యతిరేక ప్రచారం తెరమీదికి వచ్చింది. ఇది మిగిలిన సీట్లపైనా ప్రభావం చూపుతుందని తమ్ముళ్లు భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.