ఐఆర్ ఎస్ మాజీ అధికారి, టీడీపీ నాయకుడు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన దళిత మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికేఆయన జనసేన నాయకులతో చర్చలు కూడా పూర్తి చేశారని, రావెలకు జనసేనాని పవన్ కూడా రెడ్కార్పెట్ పరిచారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే కండువా మార్చుకుంటారని అంటున్నారు. 2014లో ఉద్యోగాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చిన రావెల అనూహ్యంగా టీడీపీ చెంతకు చేరి ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత మంత్రిగా కూడా చేశారు, అయితే, తీవ్ర విభేదాల కారణంగా ఆయన మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీలో టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడం ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీలో చేరాలని భావించారు. అయితే, ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండడం, వైఎస్ ఫ్యామిలీని ఆరాధించే వారే పార్టీలో ఉండడం, కష్ట కాలంలో పార్టీని కాపాడడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడా చాన్స్ దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఇక, ఎన్నికలకు సమయం మించిపోతున్న నేపథ్యంలో రావెల తన ప్రయత్నాలను జనసేన వైపు మళ్లించారు. ఇక్కడ జనసేనకు అవకాశం లబించింది. రాజధాని జిల్లా మొత్తం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న విధంగా ఉండడంతో ఇక్కడ జనసేన పావులు కదపాలంటే రావెల వంటి నాయకులు అవసరమని భావించిన పవన్.. ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే, రావెల ప్రత్తిపాడు, లేదా వేమూరు నియోజకవర్గాల్లో టికెట్ కొరుతున్నారు. దీనికి కూడా పవన్ ఓకే చెప్పారని తాజాగా ప్రచారం ఊపందుకుంది. ఏదో ఒక టికెట్ను ఇస్తామని, ముందు పార్టీ కండువా కప్పుకోవాలని రావెలను కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందుగానే ఆయన పార్టీ మారితే.. ప్రచారానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనూ ఆలోచిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామం.. రాజకీయంగా పెద్ద సంచలనం రేపకపోయినా.. ప్రత్తిపాడు వరకు మాత్రంరావెల పార్టీ మారతాడనే ప్రచారం ఏడాదిన్నరగా సాగుతున్నదే. అయితే, ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చి ఆయన జనసేనలోకి వెళ్తున్నారనే టాక్ వస్తోంది. మరి ఎప్పుడు తీర్థం పుచ్చుకుంటాడు.. అనేది వేచి చూడాలి.