హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ గెలుపుకోసం చెమటోడుస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా... ఇప్పుడు ఆయనకు తోడుగా తల్లి, వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన సోదరి షర్మిల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న విజయమ్మ... కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం వైఎస్ఆర్సీపీ పుట్టిందని ఆమె తెలిపారు. వైయస్ జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
రాబోయే ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్యాయాలు, అక్రమాలు చూశామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చదువులన్నీ కూడా ఉచితంగా చదివిస్తారని, ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తారని తెలిపారు. మద్యాన్ని మూడు దఫాల్లో నిషేదిస్తారని విజయమ్మ వివరించారు. ``ఈ ఎన్నికలు ధర్మానికి,అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, అవకాశవాదానికి,మాటకు నిలబడే తత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు.విలువలకు,విశ్వసనీయతకు పట్టంకట్టాలి. ఒకసారి వైయస్ రాజశేఖర్రెడ్డి పాలనను గుర్తుకుతెచ్చుకోవాలి. ఇది చేశాను అని చెప్పగలిగే సత్తా,సమర్థత చంద్రబాబుకు ఉందా..ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు ఉందా?`` అని ప్రశ్నించారు.
సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనంజ వేస్తోందని ప్రశ్నించారు. ``20 సంవత్సరాల క్రితం మామ రాజారెడ్డిని హత్య చేశారు. తొమ్మిదేళ్ల క్రితం రాజశేఖర్రెడ్డిని పొగొట్టుకున్నాం. అనుమానాద్పంగా ఆయన మరణించారు.నాలుగు నెలల క్రితం జగన్ను విశాఖ ఎయిర్పోర్ట్లో హతమార్చడానికి ప్రయత్నించారు. నాటకాలు,డ్రామాలు వేయడం నా కుమారుడికి రాదని,అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. మరిది వైఎస్ వివేకానందరెడ్డిని కిరాతంగా హత్యచేశారు.దీనిపై సీబీఐ విచారణ చేయించాలని అడగడం తప్పా..చంద్రబాబు ప్రతి మీటింగ్లో జగన్ చేశారని మాట్లాడుతున్నారు.వైఎస్ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు.
పరిటాల రవి హత్యకేసులో జగనే చేసేశారని అసెంబ్లీలో చంద్రబాబు నానాయాగీ చేశారని..అప్పుడు వైఎస్ఆర్ స్పందిస్తూ హత్య నా కుమారుడే చేసి ఉంటే ఉరితీయండి..సీబీఐ విచారణ చేయించారన్నారు. థర్డ్పార్టీ విచారణ వేయకుండా ఎందుకు మా కుటుంబంపై బురద చల్లుతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా..ఇప్పుడు ఎందుకు అలా సీబీఐ విచారణ కోరడం లేదు?`` అని ప్రశ్నించారు.
9 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చూస్తున్నారని విజయమ్మ పేర్కొన్నారు. ``ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. కనిగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.