జంపింగ్ లకు కేరాఫ్ అడ్రస్ అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపిని నిట్టనిలువునా చీల్చే పనిలో బిజీగా ఉన్నారటూ తెలుగు మీడియాతో పాటు.... జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన గంటా ప్రస్తుతం శ్రీలంకలో విహారయాత్రలో ఉన్నారు. శ్రీలంక పర్యటన వెనక పార్టీ మారే స్కెచ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన శ్రీలంక నుంచే బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని... ఆయన అక్కడ నుంచి వచ్చిన వెంటనే తనతో కలిసి వచ్చే ఎమ్మెల్యేలను కలుపుకుని బిజెపి గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై ఎలర్ట్ అయిన గంటా తాను పార్టీ మారడం లేదని నామ్కే వాస్తేగా చెప్పినా... శ్రీలంక నుంచి వచ్చాక ఎప్పుడైనా ఆయన ఢిల్లీ వెళ్లి కాషాయ కండవా కప్పుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీలు మారడం నియోజకవర్గాలు మారటం... గంటాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి గంటా మాటలు మార్చకుండా ఉంటారని ఎలా ? అనుకోలేం. అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడ గట్టుకునే పార్టీ మారాలని గంటా ప్రణాళికలు రచిస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి ఏపిలో బిజెపి చాలా స్ట్రాంగ్ అవ్వాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది.
తెలుగుదేశం పార్టీని పూర్తిగా అణగదొక్కేసి... ఆ ప్లేస్ లోకి వచ్చి వైసిపికి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. గంటాతో పాటు పార్టీ మారిన నేతలంతా వచ్చే ఎన్నికల నాటికి ఏపీ బీజేపీలో కీలక నేతలుగా ఉంటారు. గంటాతో పాటు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, కొండపి ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో సీనియర్ నేత కూడా గంటా ఎంతచెబితే అంతే అన్న టాక్ కూడా ఉంది.
నిప్పులేనిదే పొగరాదన్న చందంగా గంటా పార్టీ మార్పుపై ఈ స్థాయిలో వార్తలు వస్తున్నా ఆయన మాత్రం తనకు చంద్రబాబే మార్గదర్శకుడని చెప్పారు. టీడీపీతోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే పలుమార్లు జంపింగ్లు చేసిన గంటా శ్రీనివాస్ మాటలు టీడీపీ వాళ్లే నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి పార్టీ మారి ఐదేళ్ల పాటు బీజేపీ వంచన ఉంటే ఆ తర్వాత మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ దారి చూసుకోవచ్చన్న ఆలోచనలోనే గంటా ఉంటారన్నది అందరికి తెలిసిందే.