ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో...ఎగిరెగిరి పడుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్యసమితిలో ఆయన చేసిన ప్రసంగం భారత్పై ఉన్న కసిని చాటిచెప్పింది. అయితే, భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇమ్రాన్ఖాన్ ఇజ్జత్ తీసేశారు. ముంబైలో నౌకాదళం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి చేతుల మీదుగా ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ నీల్గిరి జలాంతర్గాములు జలప్రవేశం చేశాయి. ఈ సందర్భంగా రక్షణమంత్రి మాట్లాడుతూ... పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ తన చర్యలతో కార్టూనిస్టులకు చేతినిండా పని కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచం మొత్తం ఆమోదించింది. అయినా పాక్ ప్రధాని దేశాలన్నీ తిరుగుతూ కార్టూనిస్టులకు పని కల్పిస్తున్నారు అని ఎద్దేవా చేశారు.
ఆర్టికల్ 370 రద్దును ప్రపంచం మొత్తం ఆమోదించిందని, అయినా ఇమ్రాన్ ఖాన్ ప్రతి దేశం తలుపు తడుతున్నారని, చివరికి సాధించిందేమీ లేదని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు. 26/11 ముంబై దాడుల మాదిరిగా భారత తీరప్రాంత నగరాల్లో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగనీయబోమని రాజ్నాథ్ హెచ్చరించారు. ఇటీవల అమెరికాలో జరిగిన హౌడీ మోదీ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లభించిన ఘన స్వాగతాన్ని రాజ్నాథ్ గుర్తుచేశారు. అభిమానులతో కిక్కిరిసిన స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానికి ఘన స్వాగతం పలికారని, భారత్ సూపర్ పవర్గా ఎదుగుతున్నదనడానికి ఇదో నిదర్శనమని చెప్పారు. భారత ప్రభుత్వ సామర్థ్యాన్ని ట్రంప్ సైతం అంగీకరించారని, పాకిస్థాన్ అండతో రెచ్చిపోతున్న ఉగ్రవాదాన్ని భారత్ అణచివేయగలదని ఆయన చెప్పారని రాజ్నాథ్ పేర్కొన్నారు.
26/11 ముంబై దాడుల మాదిరిగా భారత తీరప్రాంత నగరాల్లో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగనీయబోమని రాజ్నాథ్ హెచ్చరించారు. తీరప్రాంతం వెంట అలజడి సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా నౌకాదళం విడిచిపెట్టదని, కఠినంగా శిక్షిస్తుందని హెచ్చరించారు. 1971 యుద్ధం సమయంలో భారత నౌకాదళం పాకిస్థాన్ వెన్ను విరిచిన విషయాన్ని గుర్తుచేశారు. భద్రతా బలగాలను ఆధునీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు మాత్రమే సొంతంగా జలాంతర్గాములను నిర్మించుకునే సామర్థ్యం ఉన్నదని, ఆ జాబితాలో భారత్ ఉండటం గర్వకారణమన్నారు. యుద్ధవిమానాలను రవాణా చేయగల నౌకలను, స్టెల్త్ ఫైటర్స్ను మన దేశం సొంతంగా నిర్మించుకుంటున్నదని చెప్పారు. అరేబియా సముద్రంలో పైరేట్ల (సముద్ర దొంగల) దాడులు తగ్గాయని, ఇందుకు భారత నౌకాదళానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. తాజాగా రెండు జలాంతర్గాముల జల ప్రవేశంతో భారత నౌకాదళం మరింత పటిష్ఠంగా, శత్రు దుర్బేధ్యంగా మారిందని చెప్పారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ గుర్తించాలని సూచించారు.