భార్య పై అనుమానం తో ఆమె క్లాస్ మెట్ ను రవి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు . ఇరువురు తాను ఇంట్లో లేని సమయం లో తన నివాసం లోనే ఏకాంతంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక రవి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది . తన భార్య జ్యోతి , ఆమె క్లాస్ మెట్ , స్నేహితుడు అయిన ప్రణీత్ రెడ్డి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని గత కొంతకాలంగా రవి అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది .
సోమవారం మధ్యాహ్నం చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ నగర్ పరిధిలోని బాలాజి నగర్ లో ప్రణీత్ రెడ్డి అనే వ్యక్తిని రవి అనే నిందితుడు కర్రతో కొట్టి చంపినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు . పోస్టుమార్టం నిమిత్తం ప్రణీత్ రెడ్డి మృతదేహాన్నిపోలీసులు ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు . ప్రాథమిక సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా , జరాసంఘం మండలం , మాచు నూరి గ్రామానికి చెందిన కొత్త ప్రణీత్ రెడ్డి ( 24 ) సోమవారం ఉదయం తన క్లాస్ మెట్ అయినటువంటి జ్యోతి ( 24 ) ను కలిసేందుకు మోహన్ నగర్ , బాలాజీ నగర్ రోడ్ నెంబర్-7 లోని ఆమె నివాసానికి చేరుకున్నాడు .
అదే సమయంలో జ్యోతి భర్త రవి బయటి నుండి ఇంటికి వచ్చాడు. భార్య జ్యోతి, ప్రణీత్ రెడ్డి లు తన ఇంట్లో కలసి ఉండడటం చూసి ఆవేశానికి లోనై కర్రతో ప్రణీత్ తలపై బలంగా బాదడం తో తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు .