తంజావూరులో శశికళ ఇంటిని కూల్చాల్సిందేనని కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు. మీరు కూలుస్తారా?మమ్మల్ని కూల్చమంటారా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు...ఆ ఇంటికి ఏమైంది?

 

తంజావూరులోని శశికళ  సొంతింటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో తమిళనాడులో చిన్నమ్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అన్నాడీఎంకే బహిష్కృతనేత అయిన శశికళకు చెన్నై, తంజావూరులలో సొంతిళ్లు ఉన్నాయి. తంజావూరులో 10 వేల 5 వందల చదరపు అడుగుల్లోని సొంతింటిలో మనోహర్‌ అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. తంజావూరు కార్పొరేషన్‌ అధికారులు గత నెల ఆ ఇంటిని పరిశీలించి నివాసయోగ్యం కానంతగా పాడుబడి పోయి ఉందని నిర్ధారించారు.

 

కూలిపోయేస్థితికి చేరుకున్న ఇంటిలో ఉండటం సరికాదని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ నిలదీశారు. మీరు కూల్చకుంటే మేమే ఆ పనిచేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి బుధవారం సాయంత్రం శశికళ ఇంటిగోడపై నోటీసు అంటించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలిగా, అమ్మ తరువాత చిన్నమ్మే అన్నంతగా పేరుబడ్డారు శశికళ. ఆమె పార్టీలోనూ, పాలనలోనూ చక్రం తిప్పారు. శశికళకు సంబంధించి ఏ చిన్న అంశమైనా రాష్ట్రంలో చర్చనీయాంశమే అవుతుంటుంది. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో మూడేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు శశికళ. ఎప్పుడూ ఏదోరకంగా వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తుంటారు శశికళ. 

 

ఇక...ఈ ఇంటిని వెంటనే కూల్చకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని శశికళ ఇంట్లో అద్దెకుంటున్న మనోహర్‌కు కార్పొరేషన్‌ కమిషనర్‌ జానకీ రవిచంద్రన్‌ నోటీసులు జారీచేశారు. తంజావూరు కార్పొరేషన్‌ పరిధిలోని ఎస్‌పీజీ మిషన్‌ ఉన్నత పాఠశాల రోడ్డులో ప్రమాదస్థితిలోని ఉన్న శశికళ ఇంటిని కూల్చివేయకతప్పదని కార్పొరేషన్ అధికారులు వివరించారు. 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇంటిని ఖాళీ చేయాలన్నారు. లేకపోతే ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలకు ఇంటి యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్పొరేషన్‌ చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటూ నిర్మాణాన్ని తొలగించేందుకు అయిన ఖర్చులను ఇంటి యజమాని నుంచి వసూలు చేస్తామని నోటీసులో తెలిపారు కార్పొరేషన్ అధికారులు.

 

అయితే ...నోటీసులు జారీచేసిన తరువాత కూడా ఇంటిని కూల్చలేదు. కనీసం ఖాళీ కూడా చేయలేదు. దీంతో తంజావూరు తహశీల్దారు వెంకటేశన్, కార్పొరేషన్‌ ఇంజినీర్లు శశికళ ఇంటికి చేరుకుని మనోహరన్‌ను విచారించారు. చెన్నైలోని శశికళ బంధువులకు నోటీసు విషయం చెప్పారు, ప్రస్తుతం ఆ ఇంటిలో ఎవ్వరూ నివసించడం లేదు, తాను వెనుకనున్న పోర్షల్‌ ఉంటున్నానని మనోహరన్‌ అధికారులకు వివరించాడు. దీంతో శశికళ ఇంటి ప్రవేశద్వారంలోని గోడపై నోటీసు అంటించారు. ఇంటిని ఖాళీచేసి కూల్చివేయాల్సిందిగా నోటీసులో ఇచ్చిన గడువు తీరిపోయింది, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని అధికారులు మనోహరన్‌ను నిలదీశారు. ఇంటిపై నోటీసు అంటించిన కారణంగా వెంటనే ఖాళీచేయాలని...లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. శశికళ ఇంటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: