మీరు తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారా? మీకు ఈ కొత్త షాకింగ్ న్యూస్ తెలియకపోతే ఇబ్బంది పడతారు. ఆర్టీసీ సమ్మె, అనంతరం పరిణామాలు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ..దాని అమలు క్రమంలో కీలక నిర్ణయం అమలులోకి వచ్చింది. ఆర్టీసీ సమ్మె ముగిసిన అనంతరం గత డిసెంబర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ దృష్టికి ఉద్యోగులు కీలక అంశాలు తీసుకొచ్చారు. అందులో ప్రయాణికుడు ఉద్దేశపూర్వకంగా టికెట్ తీసుకోకపోయినా తమను బాధ్యులను చేస్తున్నారనేది ఓ ముఖ్యమైన అంశం. దీనిపై ఆ సమయంలో కేసీఆర్ హామీ ఇవ్వగా నేడు అమల్లోకి వచ్చింది.
ఆర్టీసీ బస్సుల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా, మరికొందరు రద్దీ కారణంతో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీలో టికెట్ లేనట్టు గుర్తిస్తే జరిమానా విధిస్తారు. అయితే, గతంలో ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోతే కండక్టర్లపైనా చర్యలు తీసుకునేవారు. సదరు కండక్టరును వారంపాటు డిపోకే పరిమితం చేయడం, ఇంక్రిమెంట్లో కోతలు విధించడం, కొన్ని సందర్భాల్లో ఆ కండకర్టుపై సస్పెన్షన్ వేటు వేయడం వంటి చర్యలు ఉన్నతాధికారులు తీసుకునేవారు. ఈ విషయంలో ఎందరో ఆవేదన చెందారు. అయితే, గత ఏడాది జరిగిన ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమణ అనంతరం సీఎం కేసీఆర్తో జరిగిన ఆత్మీయ సమావేశంలో తమ ఆవేదనను పలువురు కండక్టర్లు పంచుకున్నారు. దీన్ని విన్న సీఎం కేసీఆర్ టికెట్ తీసుకోవడం ప్రయాణికుడి బాధ్యతేనని, ఇకపై కండక్టర్లపై చర్యలు ఉండవని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు టికెట్ తీసుకోకపోతే సదరు బస్సు కండక్టర్కు ఎలాంటి బాధ్యత ఉండదు. ప్రయాణికుడే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ క్లారిటీగా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా టికెట్ తీసుకోనందుకు రూ. 500 వరకు సదరు వ్యక్తి జరిమానా చెల్లించాల్సిందే. ఈ నిర్ణయం తమకు పెద్ద ఊరట ఇచ్చేదని కండక్టర్లు పేర్కొంటున్నారు. అందుకే, ఆర్టీసీలో ప్రయాణించే వారు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే, తెలియక చేసినా, వీలుకాక చేసినా... తెలిసి చేసినా...తప్పు తప్పుఏ కాబట్టి.