దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు... కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 55 రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఆరు సంవత్సరాల క్రితం రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన 55 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ 55 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 55 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక మార్చి 6వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు... తెలంగాణ నుంచి ఇద్దరు కొత్తగా రాజ్యసభకు ఎంపిక ఉన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలాబలాలను బట్టి చూస్తే తెలంగాణలో రెండు స్థానాలు అధికార టీఆర్ఎస్ ఖాతాలో పడుతుండగా... ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలో ఉన్నాయి.
తెలంగాణ నుంచి కేవీపీ రామచంద్రరావు, గరికపాటి రామ్మోహన్ రావు పదవీ కాలం ముగియనుంది. వీరిలో కేవీపీ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉండగా.. టీడీపీ నుంచి ఎంపీ అయిన గరికపాటి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇక ఏపీ కోటాలో రిటైర్ అవుతున్న వారిలో ఏంఏ . ఖాన్, సుబ్బిరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మి, కె. కేశవరావు ఉన్నారు. వీరిలో మళ్లీ ఎవ్వరూ కూడా తిరిగి రాజ్యసభకు ఎంపికయ్యే ఛాన్సులు లేవు. ఇక ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు చేయడంతో మండలిపై ఆశలు పెట్టుకున్న నేతలు అందరూ ఇప్పుడు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతుండడంతో వైసీపీలో రాజ్యసభ సీట్లకు డిమాండ్ ఎక్కువుగా ఉంది.