ఏపీ సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. రైతుల కోసం జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతన్నకు భరోసాగా నిలుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మరోసారి నిలబెట్టుకున్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఎన్నికల సమయంలో జగన్.. రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని సాకారం చేసే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. అంటే.. వ్యవసాయానికి అందించే విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో పంపిణీ సంస్థలకు అందిస్తోంది.
ఈ సబ్సిడీ టీడీపీ హయాంలో తక్కువగా ఉండేది. గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ వినియోగ సామర్థ్యం 1.11 కోట్ల అశ్వశక్తి అంటే 8,300 మెగావాట్లు ఉంటుంది. 2015–16లో విద్యుత్ సబ్సిడీలు రూ.3,186 కోట్లు ఉండగా 2018–19 నాటికిరూ.4 వేల కోట్లకు చేరుకున్నాయి.
ఈ మొత్తంలోనూ గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకపోవడంతో డిస్కమ్లు అప్పుల్లోకి వెళ్లాయి. 2020–21లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి ప్రభుత్వం రూ.8,354 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇది డబల్ కంటే ఎక్కువే. ఇలాంటి సమయంలో జగన్ సర్కారు.. 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపడం విశేషం.