ఇక ఇప్పుడు రైతులకు ఖరీఫ్కు సంబంధించిన ఇన్ఫుట్ సబ్సిడీ ఇదే సీజన్లో ఇచ్చేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారి అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఖరీఫ్లోని జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన ఇన్ఫుట్ సబ్పిడీకి అవసరమైన నిధులను విడుదల ఏపీ సర్కారు త్వరలోనే విడుదల చేయబోతోంది. ఈ మేరకు సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించినట్టు వైసీపీ ప్రకటించింది.
రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలు, స్పందన కార్యక్రమం, నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రులపైనా జగన్ సమీక్ష నిర్వహించారు.
అదే సమయంలో ఈ నెల 21న ప్రారంభిస్తున్న వైయస్ఆర్ బీమాపైనా సీఎం జగన్ అధికారులతో చర్చించారు. స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న పనుల వివరాలపైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల ప్రగతిపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఉచిత విద్యుత్- రైతు అకౌంట్లో నగదు జమ అంశాలపైనా సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చించారు. అదే సమయంలో వైఎస్సార్ జలకళ పథకం పట్ల ప్రజల్లో ఉన్న సందేహాలు తీర్చాలని.. టీడీపీ నాయకులు మీటర్ల విషయంలో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని.. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలని జగన్ అధికారులకు సూచించారు.