ఏపీ ఆదాయం అంతంత మాత్రమే.. కేంద్రం సహకారం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఏమాత్రం సహకారం లభించడం లేదు. ఆర్థికంగానూ పెద్దగా ఆదుకోవడం లేదు. అయినా జగన్ సర్కారు మాత్రం ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూనే ఉంది. తాజాగా విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేసి ఇందులో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసు, స్టేట్‌ డేటా సెంటర్, ఐటీ టవర్స్‌ ఇవన్నీ కూడా  ఏర్పాటు చేస్తామంటోంది.

విశాఖ ఐటీ పార్క్‌ వివరాలేంటంటే.. విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన ఉంటుందట. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారట. ఇంజినీరింగ్‌ సహా.. ఇతరత్రా సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకూ ఈ యూనివర్శిటీ ఉపయోగపడుతుందట.

విశాఖలో ఐటీ పార్కే కాదు.. రాష్ట్రంలో  మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేస్తారట. విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో.. మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకుంటారట. ఈ కాన్సెప్ట్ ‌సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయట.  నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ యునిక్‌గా ఉండాలని, ప్రతి కాన్సెప్ట్‌ సిటీకి సంబంధించిఒక ప్రత్యేకమైన మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం పెరిగిందని.. ఈ సంస్కృతిని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. అలాగే కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌పై దృష్టిపెడతారట. రాష్ట్రంలో వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: