అధికారం ఎవరి చేతిలో ఉంటే వారిదే హవా అన్నది ఎప్పుడూ ఉండేదే! ఇందుకు వైసీపీ కానీ టీడీపీ కానీ మినహాయింపు కాదు. చాలా చోట్ల పదవులే పరమావధి. చాలా మంది పదవులే గాలీ నీరూ నిప్పు. అందుకే నిప్పులాంటి రాజకీయాల్లో పదవులే అగ్గికి ఆజ్యం పోసేలా ఉంటాయి. దక్కినోళ్లంతా ఒకవిధంగా దక్కని వారంతా ఇంకో విధంగా ఆ అగ్గి మంటల దగ్గర ప్రవర్తిస్తూ పోతుంటారు. కనుక ఎన్నికలన్నవి ప్రజాస్వామ్యాన్నే కాపాడుతాయి అని అనుకోవడంలో ఉన్న తప్పు ఇంకెక్కడా ఇంకెందులో కూడా ఉండదు అన్నది కఠోర వాస్తవం.
ఇవాళ కుప్పం మున్సిపాల్టీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు ఎన్నికలనూ కీలకంగానో, క్రియాశీలకంగానో తీసుకున్నారు. వీటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించి కొన్నింట ఉప ఎన్నికలు కూడా నిర్వహణకు నోచుకుంటున్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు చేసింది. కొన్ని చోట్ల అధికార దుర్వినియోగం కూడా చేసిందన్న విమర్శలున్నాయి. ఇదే సందర్భంలో మిగతా చోట్ల జగన్ పరువు మరియు ప్రతిష్ట ఎలా ఉన్నా ఈ రెండింట మాత్రం ఆయన నెగ్గేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అందుకు చేసిన వ్యూహాలు అన్నీ అన్నీ సఫలీకృతం అయ్యేలానే ఉన్నాయి. కుప్పంలో 25 వార్డులకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కొన్నింట అప్పుడే తగాదాలూ ఉన్నాయని అవన్నీ వెలుగులోకి రావడం కష్టమేనని తెలుస్తోంది. టీడీపీ,వైసీపీ పోరుకు రిఫరీగా చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇక్కడ పోరుకు సారథి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్న సంగతి అందరికీ విధితమే!
ఇక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్నవి మంత్రి అనీల్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ జరుగుతోంది. తెల్లారింటికే మహిళలు ఎక్కువగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నది ఓ ప్రాథమిక సమాచారం. 54 డివిజన్లు ఉన్న నెల్లూరు మున్సిపాల్టీలో ఇప్పటికే 8 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగతావి కూడా వైసీపీ ఖాతాలోకే చేరనున్నాయి. గతంలో కన్నా చాలా బలంగా ఉన్న పార్టీ వైసీపీనే అని తేల్చేశారు అక్కడి రాజకీయ పరిశీలకులు. మేయర్ పదవికి ఎస్టీ మహిళను ఎంపిక చేశారు. దేవరకొండ సుధ అనే నాయకురాలికి ఈ వరం దక్కింది. ఈ రెండు ఎన్నికల తరువాత జగన్ వేటిపై దృష్టిసారిస్తారో అన్నది ఆసక్తిదాయకంగా ఉంది. మంత్రి వర్గ విస్తరణ చేస్తారా లేదా సంక్రాంతికే ఆ కానుక ఇస్తారా? ఏడాదంతా ఎన్నికల హడావుడిలో అలసిపోతున్న మంత్రులకు ఇప్పటికైనా రిలీఫ్ ఉంటుందా?