సీనియర్ రాజకీయ నేత అయిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను తన కనుసైగల తో శాసించారు. వైఎస్ఆర్ తో పాటు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే చివర్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినా గత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.
గత ఎన్నికల్లో పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా సీనియార్టీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ మాత్రం తనకోసం ఎమ్మెల్యే పదవి వదులుకుని.. 2012 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తన కోసం ఎమ్మెల్యే పదవి వదులుకున్న క్రిష్ణదాస్ అంటే నే జగన్ ఇష్టం. పైగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.
జగన్ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన తో పాటు.. భవిష్యత్తులో తనకు మంత్రి పదవి రాదని ధర్మాన ప్రసాదరావు డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన అధిష్టానంను ఇబ్బంది పెట్టేలా చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆఫీసు లోనే ప్రెస్ మీట్ లు పెట్టాలని ఇటీవల పైనుంచి ఆదేశాలు వచ్చినా కూడా ధర్మాన మాత్రం తన ఇంట్లోనూ... తనకు నచ్చిన ప్రదేశాలలోను పెడుతున్నారట. ధర్మానను కంట్రోల్ చేయాలని పార్టీ హైకమాండ్ నుంచి ఆయన సోదరుడు కృష్ణదాస్ కు కూడా ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఏదేమైనా ధర్మాన కూడా జగన్కు ట్రబుల్గా మారిపోయారని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.