ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అని చంద్రబాబు ప్రకటిస్తున్నా.. గతంలో మాదిరిగానే టీడీపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగా వెళ్లే సాహసం చేయదని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పొత్తులపై ఇలాంటి సంకేతాలనే ఇస్తున్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని టీడీపీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేతలు పరేషాన్ చెందుతున్నారు.
టీడీపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరోవైపు టీడీపీలో ఒకరిద్దరు నేతలకు మినహాయించి మిగిలిన నేతలకు ప్రాధాన్యం లభించడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ముందుగానే జనసేనలో కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ జిల్లాల్లో జనసేన బలంగా ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లను జనసేనను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఈ జిల్లాల్లోని టీడీపీ నేతల సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం నెలకొంది. దీనిపైనే నేతలు తర్జన భర్జన పడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు ముందుగానే జనసేన వైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ నేతలు ముందుగానే జనసేనలోకి వెళ్లి తమ సీటును ఖరారు చేసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. కాకినాడ రూరల్, రాజానగరం నియోజకవర్గ నేతలు ఇప్పటికే టీడీపీ గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని టాక్ విన్పిస్తోంది. వైసీపీని ఓడించాలంటే జనసేనలోకి వెళ్లడమే ఉత్తమమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి వీరి దూకుడుకు చంద్రబాబు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.