అయితే వైస్ ఎంపీపీ విషయంలో అశోక్ అప్పటికే రాజకీయ దురంధరుల వేదిక అయిన పాతూరు గ్రామానికి ఇస్తానని బహిరంగంగా మాట ఇచ్చారు. పాతూరు టీడీపీ కీలక నేతల అడ్డా. ఆయన మాట ప్రకారం పాతూరు గ్రామం నుంచి (కామవరపుకోట - 2) ఎంపీటీసీగా గెలిచిన తమ్మిశెట్టి గిరిజ నాగ సరస్వతి వైస్ ఎంపీపీగా బీసీ కోటాలో ఎంపిక కావాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే ఎలీజా ఉప్పలపాడు ఎంపీటీసీకి వైస్ ఎంపీపీ ఇవ్వాలని షరతు పెట్టడంతో అశోక్ హామీ ఇచ్చిన గిరిజకు అప్పుడు వైస్ ఎంపీపీ పదవి రాలేదు.
ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రెండో వైస్ ఎంపీపీ పదవి ఎన్నిక జరిగింది. అయితే పార్టీలోని కొందరు నేతలు అశోక్ హామీ ఇచ్చిన గిరిజకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఎంపీపీ పదవి ఇవ్వకూడదని ఎమ్మెల్యే వద్ద విశ్వప్రయత్నాలు చేశారు.
సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎలీజా..
కామవరపుకోట మండలంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలు స్థానిక ఎంపీటీసీ (కామవరపుకోట-1) బొల్లి సత్యనారాయణకు వైస్ ఎంపీపీ పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన ముందుకు తీసుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అశోక్ మాట నెగ్గకూడదని.. ఆయన హామీ ఇచ్చిన గిరిజకు వైస్ ఎంపీపీ పదవి రాకూడదని చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. అయితే ఎమ్మెల్యే ఎలీజా మాత్రం అశోక్ కే ఓటు వేశారు. ఒకానొక దశలో తడికలపూడి చెందిన ఎంపిటిసి కడియాల గంగుల పేరును కూడా బీసీ కోటాలో తెరమీదకు తెచ్చి వైస్ ఎంపీపీ పదవి ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే వర్గం ప్రయత్నించింది.
అయితే ప్రజా క్షేత్రంలో అశోక్ బలం ఏంటో ఎమ్మెల్యేకు తెలుసు. 2024 సాధారణ ఎన్నికల్లో అశోక్ కామవరపుకోట మండలంలో పోల్ మేనేజ్మెంట్లో ఆర్థిక - అంగబలంలో తనకు ఎలా ? ప్లస్ అవుతారో ఎమ్మెల్యేకు తెలుసు. అలాంటి వ్యక్తితో సమన్వయంతో ముందుకు వెళితే ఎమ్మెల్యేకు చాలా ప్లస్ అవుతుంది. ఇక తనపై ఒత్తిడి చేస్తోన్న నేతల బలం ఏ పాటిదో ఎమ్మెల్యేకు తెలియంది కాదు. ఈ సమీకరణలు బేరీజు వేసుకున్న ఎలీజా చివరకు తమ్మిశెట్టి గిరిజకు వైస్ ఎంపీపీ పదవి ఇచ్చేందుకు ఓకే చెప్పారు. దీంతో ఆమె కామవరపు కోట రెండో వైస్ ఎంపీపీగా ఎంపికయ్యారు. ఫైనల్ గా అశోక్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మండలంలో తన పట్టు ఏంటో ఫ్రూవ్ చేసుకున్నారు.