వినూత్న పాలనా విధానాలతో సాధారణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు కేజ్రీవాల్.  అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి..  అందుకు అనుగుణంగా పలు చర్యలు చేపట్టారు.  అయితే దిల్లీలోని ఆప్ ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.  ఈ కుంభకోణంలో ఈడీ సమన్ల తర్వాత దిల్లీ సీఎం కేజ్రీవాల్ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  దీంతో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.


ఒకవేళ ఈడీ తనను అరెస్టు చేస్తే ఏం చేయాలనే దానిపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈడీ తనను అరెస్టు చేస్తే తీహార్ జైల్లోనే కాబినేట్ సమావేశం ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. మరోవైపు తాను ఏ పాపం చేయలేదు అని కాకుండా తప్పు చేయని వారు ఎవరు అనే కోణంలో మాట్లాడుతున్నారు.


అరవింద్ కేజ్రీవాల్ పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ఆ పార్టీకి  సాధారణ క్లర్క్ దగ్గర నుంచి మధ్య తరగతి ప్రజల వరకు అందరూ విరాళాలు అందించారు. అంతగా నమ్మారు కేజ్రీవాల్ ని. నిజాయతీ పరమైన రాజకీయాలు కావాలంటూ ఎదిగిన కేజ్రీవాల్ గోవా, పంజాబ్ లో మాత్రం తన శైలికి విరుద్ధంగా వెళ్లారు. పలు చోట్ల ఓటమి ఎదురవుతుండటంతో తమ ఓటమికి ఆర్థిక పరమైన విషయాలే కారణం అని ఆయన గ్రహించారు.  


అయితే తాజాగా ఈడీ నోటీసులు ఇస్తుందంటే తన అరెస్టు తప్పదని భావిస్తున్నారు. అందుకేనేమో నన్ను జైలులో పెడతారు కాక మీరు మాత్రం ఏనాటికి గెలవరు అని కొత్త రాగం అందుకున్నారు. మరోవైపు కుటుంబ పాలనకు వ్యతిరేకం అని చెప్పిన కేజ్రీవాల్ తన స్థానంలో ఆయన భార్యను కూర్చోబెట్టాలని చూస్తున్నారని సమాచారం. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అవినీతిపైనే దారి తప్పాడు అనుకుంటే ఇప్పుడు పదవిని కుటుంబం నుంచి జారనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.  ఇప్పుడు కేజ్రీవాల్ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆయన రాజీనామా చేస్తారు అనే వార్త దిల్లీలో చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: