వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు దెబ్బకు మారిపోతున్నాయి.నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే.. వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు కొంతమంది నేతలు.ఇదిలా ఉంటే అభ్యర్థుల జాబితా అనేది టీడీపీ నేతల్లో కాస్త కలవరపెడుతోంది. ఇదే అదనుగా భావించిన వైసీపీ మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. మొన్న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మ్యానిఫెస్టోపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ మేరకు మ్యానిఫెస్టో రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్దం సభలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగో సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల జిల్లా మేదరమిట్లలో జరిగే సిద్దం భారీ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఎంపీ విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.


ఈ సభలోనే వైసీపీ రెడీ చేసిన కొత్త మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తాజాగా మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే సిద్దం సభకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మార్చి 10 వ తేదీన జరిగే మేదరమిట్ల సభలో దాదాపు 15లక్షల మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెబుతున్నారు. దీనికి తగ్గ అన్ని పనులను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇక గత నాలుగు సంవత్సరాల 10 నెలల్లో ఏం చేశారు.. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఛాన్స్ ఇస్తే ఏం చేయబోతున్నారన్న దానిపై ముఖ్య మంత్రి జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. బీసీలకు ముఖ్య మంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, టీడీపీ ఎప్పుడూ బీసీలకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. మార్చి 10 వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ కొన్ని పథకాలను వెల్లడించింది.అయితే టీడీపీ ప్రవేశపెట్టినవి వైసీపీ ప్రవేశపెట్టబోయేవి ఒకేలా ఉంటాయా భిన్నంగా ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: