కాంగ్రెస్ పార్టీతో ఎవరికీ నష్టం అంటే ముందుకు గుర్తొచ్చేది వైసీపీ. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది ఆ పార్టీలో ఉన్న వారంతా కాంగ్రెస్ మాజీ నేతలే. కాబట్టి.. కచ్ఛితంగా వైసీపీకి నష్టం కలుగుతుందని అంచనా వేశారు. పైగా షర్మిళ వైసీపీతో పాటు సోదరుడు జగన్ ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. విమర్శిస్తున్నారు. కాబట్టి షర్మిళ వైసీపీ ఓటు బ్యాంకుకే గండి పెడుతుందని తెలుగు తమ్ముళ్లు భావించారు. కానీ చాపకింద నీరులా కాంగ్రెస్ టీడీపీ ఓటు బ్యాంకుకు గండి పెడుతుంది.
షర్మిళ కాంగ్రెస్ లో చేరడానికి చంద్రబాబు కారణం అని వైసీపీ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆమె వైసీపీనే టార్గెట్ చేశారు. సోదరుడు జగన్ పై గురి పెట్టారు. తెలంగాణ, కర్ణాటక లో గెలిచే సరికి ఏపీలో కాంగ్రెస్ అభిమానులు యాక్టివ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి పెరిగి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. పైగా కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలో దించుతోంది. డాక్టర్ కిల్లి కృపారాణి, సాకే శైలజానాథ్, పల్లం రాజు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు వంటి సీనియర్ నాయకులతో పాటు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు, మాజీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయిస్తోంది. వీరిలో కొంతమంది వ్యక్తిగత ప్రభావం కూడా చూపగలరు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. ఇది వైసీపీకి అనుకూలంగా మారి తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని భావించి చంద్రబాబు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శలు గుప్పించారు. మొత్తానికి కాంగ్రెస్ అటు వైసీపీని, ఇటు టీడీపీని భయపెడుతోంది.