ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది..మే 13 న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.. అయితే ఈసారి ఎన్నికలు ఎంతో ఉత్కంఠతగా మారునున్నాయి. గత ఎన్నికలలో కలిసి పని చేసిన అన్నా చెల్లెళ్లు ఊహించని విధంగా ఈ సారి ప్రత్యర్థులుగా మారిపోయారు..గత ఎన్నికలలో వైసీపీ తరుపున ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తేవడానికి వైఎస్ షర్మిల తీవ్ర కృషి చేసింది. అయితే ఈ సారి అన్నా చెల్లెళ్ల మధ్య విబేధాలు రావడంతో షర్మిల కాంగ్రెస్ తరుపున బరిలో నిల్చున్నారు.అయితే ఈ అన్నా చెల్లెళ్ల రాజకీయ పోరులో వారి తల్లి విజయమ్మ ఎవరి వైపు వుంటారనే ఉత్కంఠత నెలకొంది . తాజాగా ఆ ఉత్కంఠకు తెరదించుతూ విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయారు. గత ఎన్నికల సమయంలో జగన్ విజయం కోసం వైఎస్ కుటుంబం అంతా కలిసి పనిచేసారు.వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల విస్తృతంగా ప్రచారం చేసి మరీ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. వారి ప్రచారం ఫలించి ఆ ఎన్నికలలో జగన్ భారీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనం హృదయాలను గెలుచుకున్నారని చెప్పాలి.

అయితే గత ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తన విజయంలో కీలక పాత్ర పోషించిన షర్మిలను జగన్ పక్కన పెట్టేశారు. రాజకీయంగా ఆమె ఎదుగుదలకు బ్రేకులు పడ్డాయి... దీంతో ఆమె అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్లిపోయారు.ఆమెకు అండగా తల్లి విజయమ్మ కూడా ఆమెతో వెళ్ళిపోయింది.. తెలంగాణలో షర్మిల వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించింది. కూతురుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో విజయమ్మ వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి వైసీపీ పాలనపైనే విమర్శలు సంధిస్తున్నారు. దీంతో రాజకీయంగా అన్నా చెల్లెళ్లిద్దరూ ప్రత్యర్థులుగా మారారు.. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అందరి దృష్టీ విజయమ్మపైనే ఉంది.కొడుకా.. కూతురా..ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి నెలకొంది. 

సరిగ్గా ఇదే సమయంలో జగన్ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి మార్చి 27న ఆ సందర్భంగా యాత్ర ప్రారంచారు. అయితే ఈ కార్యక్రమానికి తల్లి విజయమ్మ హాజరయి జగన్ ను ఆశీర్వదించారు.దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది. విజయమ్మ కొడుకువైపే ఉందని అంతా భావించారు.. అయితే ఆ తరువాత షర్మిల కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంలో కూడా విజయమ్మ కుమార్తెను ఆశీర్వదించేందుకు అక్కడకు వెళ్లారు.. అయితే ఇద్దరిలో ఆమె మద్దతు ఎవరికి అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.తాజాగా ఎన్నికల వేళ ఈ దేశంలోనే ఉండకుండా విజయమ్మ విదేశాలకు వెళ్లిపోవడం సంచలనంగా మారింది.జగన్ కు మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేకనే ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారని కొందరు అంటున్నారు. షర్మిలకు తోడు విజయమ్మ కూడా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవన్న భయంతోనే జగన్ ఒత్తిడి చేసి ఆమెను విదేశీ పర్యటనకు వెళ్లేలా చేశారని కొందరు చెబుతున్నారు. అయితే అస్సలు నిజం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: