- టెన్షన్లో బాబు.. ఫుల్ రిలాక్స్ మోడ్లో జగన్
- బాబు అనుకుందొకటి.. అయ్యిందొకటి...!
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
అసాధ్యమనుకున్న పొత్తును సాధ్యం చేసుకున్నారు. 2019లో కాదనుకున్న పార్టినీ ఐదేళ్లు గడిచేసరికి చెంతకు చేర్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలంటే.. బలమైన పార్టీగా ఉన్న వైసీపీని ఎదుర్కొనాలంటే.. బీజేపీ అవసరం ఎంతో ఉందని చంద్రబాబు భావించారు. రాష్ట్రంలో ఈ పార్టీకి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని కాదు.. ఇక్కడ గణనీయ సంఖ్యలో బీజేపీకి కార్యకర్తలు ఉన్నారని కాదు. కేంద్రంలో ఈ పార్టీ బలంగా ఉన్నందుకే చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారు.
అయితే.. ఈ పొత్తు విషయంపై పైకి చెబుతున్న మాట.. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు పరుగులు పెట్టా లంటే.. కేంద్రంలో బలంగా ఉన్న పార్టీతో పొత్తు అవసరమని. రాష్ట్రానికి నిధులు కావాలన్నా.. కేంద్రంతో సఖ్యత అవసరమని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ, అసలు ముఖ్య ఉద్దేశం వేరే ఉంది. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలి. ఇది సాకారం కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చెలిమి అవసరం. ఇదే చంద్రబాబుకు తక్షణం కావాల్సిన మేలు.
ఇది.. కేంద్రం ఇచ్చే కోట్ల రూపాయలకన్నా కూడా చంద్రబాబుకు ఎక్కువ. ఎన్నికల వేళ.. వైసీపీ అదినే త, సీఎం జగన్ను ఉక్కిరిబిక్కిరికి గురి చేయాలన్నది చంద్రబాబు వ్యూహం. ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ను ఎలా అయితే.. కేంద్రం ఇరుకున పెడుతోందో.,. అచ్చం అలానే.. ఏపీలో సీఎం జగన్ను కూడా ఇరుకున పెట్టి.. ఆయన ఎన్నికలపై దృష్టి పెట్టలేనందగా ఇబ్బంది పెట్టాలనేది.. పెడుతుందనేది బాబు వేసుకున్న ప్లాన్.
ఇది తనకు మాత్రమే కాకుండా.. బీజేపీకి కూడా ఉపకరిస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. జగన్ను కట్టడి చేయడం ద్వారా బీజేపీ కూడా ఎదుగుతుందని ఆశలు పెంచుకున్నారు. అందుకే.. అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్లి మరీ చర్చలు జరిపారు. కానీ, అనుకున్న విధంగా అయితే.. జగన్పై ఒత్తిడి తీసుకురాలేక పోయారు. బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించలేక పోయారని తెలుస్తోంది. దీంతో జగన్ స్వేచ్ఛగా నెల రోజులకు పైగా పూర్తి షెడ్యూల్తో ప్రజల్లోనే ఉన్నారు. దీనిని బట్టి.. చంద్రబాబు ఊహించింది ఒకటైతే.. జరిగింది మరొకటనే చర్చ సాగుతోంది.