![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/2024-elections-gundusudi-seenu-popular-with-impartial-analysis9bbc3a92-2a65-4aa9-abd9-7505833612c7-415x250.jpg)
- ఈనాడులో తక్కువ టైంలోనే బ్యూరో రిపోర్టర్ స్థాయి
- ఉన్నది ఉన్నట్టు సూటిగా స్పష్టంగా విశ్లేషణల్లో నేర్పరి ఈ 'మానెం శ్రీను '
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల నుంచి సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది. దీంతో సొంతంగా విశ్లేషణలతో సోషల్ మీడియాలో ఎక్కువ మంది జర్నలిస్టులు బాగా పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల వేళ రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు గుండుసూది శీను అలియాస్ జర్నలిస్ట్ శ్రీనివాస్.. శ్రీకాకుళం జిల్లాలో ఓ మారు మూల పల్లెకు చెందిన మానెం శ్రీనివాస్ ఈనాడులో చిన్న వయస్సులోనే మండల కంట్రిబ్యూటర్ స్థాయిలో చేరారు.. అక్కడి నుండి జిల్లా, స్టేట్ రిపోర్టర్ స్థాయికి ఎదిగారు. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో శ్రీనివాస్ జిల్లా రిపోర్టర్గా పనిచేసే టైంలో పలు పరిశోధనాత్మక కథనాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని అవార్డులు, రివార్డులు కూడా ఆయనకు దక్కాయి.
మారిన సమకాలీన అంశాల నేపథ్యంలో ప్రింట్ మీడియా వదిలి.. 2020లో ఓ ప్రముఖ పాపులర్ న్యూస్ వెబ్సైట్కు రాష్ట్రస్థాయి కంటెంట్ హెడ్గా పని చేశారు. తర్వాత అనతి కాలంలోనే 2021 మే నెలలో సొంతంగా గుండుసూది - పిన్ ఛానెల్ స్థాపించి.. కొద్ది కాలంలోనే గుర్తింపు తెచ్చుకుని.. ఇదే పునాదులతో 2021 అక్టోబరులో ఏపీ 175 ఛానెల్ స్థాపించారు.. తర్వాత తెలంగాణ కోసం టీఎస్ 119 యూట్యూబ్ ఛానెల్ ఛానెల్స్ స్థాపించారు. ముఖ్యంగా గుండుసూది-పిన్ (Gundusoodhi PINN) ద్వారా తెలుగు రాజకీయాలు, జాతీయ రాజకీయాలపై లోతైన విశ్లేషణలు అందిస్తూ వస్తున్నారు. ఏపీ 175 ద్వారా ఏపీ రాజకీయాలపై సమగ్ర సమాచారంతో కూడిన విశ్లేషణలు, అటు టీఎస్ 119 ద్వారా పరిమితంగా తెలంగాణకు చెందిన విశ్లేషణలు అందించారు. మరీ ముఖ్యంగా గుండుసూది, ఏపీ 175 ఛానెల్స్ అయితే ఈ ఎన్నికల టైంలో గత యేడాదిన్నర కాలం నుంచి ప్రతి ఒక్కరికి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది చెపుతూ వచ్చారు.
ముందస్తు అంచనాల్లో టాప్ విశ్లేషకుడు..!
తిరుపతి ఉప ఎన్నిక మొదలు.. బద్వేలు ఉప ఎన్నిక, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందో కచ్చితంగా అంచనా వేశారు. పోలింగ్ జరిగిన నాడు ఆయన చెప్పిన లెక్క ప్రకారమే ఫలితాలు కనిపించాయి.. దాంతో ఆయన క్రెడిబులిటి అమాంతం పెరిగింది.. అయితే గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తడబడ్డారు.. యువత చైతన్యంగా ఓటు వేయరు, అధికారమే గెలుస్తుంది అని నమ్మి, విశ్లేషణ అందించారు.. ఆ ఒక్క అంచనాలు తప్పితే.. మిగిలినవి దాదాపు ఆయన ముందుగా అంచనా వేసినట్టే జరిగాయి.. కీలక నాయకుల పార్టీల మార్పులు, సీట్లు ఎంపిక, ఎమ్మెల్యేల మార్పులు ఇలా కీలక సున్నిత అంశాలను ముందుగా చెప్పి లక్షలాది వ్యూయర్స్ సంపాదించగలిగారు..
నియోజకవర్గాల వారీ విశ్లేషణే హైలెట్..!
శ్రీనివాస్ విశ్లేషణల్లో నియోజకవర్గాల వారీగా గత యేడాదిన్నర కాలం నుంచే ప్రధాన పక్షాల నుంచి ఎవరెవరు పోటీలో ఉంటారు..? అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇన్చార్జ్లు పనితీరు ఎలా ఉంది..? ఎవరికి ఎలా అవకాశాలు ఉంటాయి..? మార్పులు, చేర్పులతో ప్రతి అంశాన్ని కూలంకషంగా సామాన్యుడిగా కూడా అర్థమయ్యే భాషలో వివరించారు. ఇదే గుండుసూది శీను ను ఏపీ సోషల్ మీడియాతో పాటు సాధారణ పౌరులకు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. తన వాట్సాప్ నెంబర్ ద్వారా ఏపీలో సామాన్యుల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాలు సేకరించి సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారు..? గట్టి పోటీ... ఒక్కో నియోజకవర్గం గురించి ఒక్కో వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తున్నారు.
ఓవరాల్గా శ్రీనివాస్ సర్వేలు కూటమికి మొగ్గు చూపిస్తున్నాయి. అలాగే ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులకు సెఫాలజిస్ట్గా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో వారు గెలిచి సక్సెస్ అయితే ఎన్నికల తర్వాత గుండుసూది శీను పేరు ఏపీలో మరింత పాపులర్ కావడం ఖాయం. ఇక ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్న కీలక సమస్యలపై ఓ ఉద్యమం లాగా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పడం కూడా శ్రీనివాస్ను సోషల్ మీడియాలో మరింత పాపులర్ చేయడంతో పాటు బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఏదేమైనా ఈ సారి ఏపి ఎన్నికలు ఓ సరికొత్త యువ జర్నలిస్టు అద్భుత ఆలోచనను ఆవిష్కరింపజేశాయి.