ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంగా రైతు సమస్యలు వరుసగా తలెత్తుతూ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సవాళ్లుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పొగాకు, మామిడి, మిర్చి, ధాన్యం, ఉల్లిపాయ, యూరియా సరఫరా సమస్యలు, అకాల వర్షాలు వంటి పరిణామాలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టినా, పరిష్కారం పూర్తిగా సాధ్యంకాలేదు. ఇప్పుడు ట‌మాటా ధ‌ర‌లు కొత్త సమస్యగా తెరపైకి వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే కిలో టమాటా ధర రూ.15 నుండి రూ.1కి పడిపోయింది. దీంతో కర్నూలు జిల్లాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మార్కెట్ యార్డుల్లో టమాటాలు అమ్మకానికి రావడం లేదని, కనీస గిట్టుబాటు ధర కూడా అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. నిరసనగా పంటను రోడ్డుపై పోసి ప్రభుత్వంపై నినాదాలు చేస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే మామిడి, ఉల్లిపాయ, మిర్చి రైతుల సమస్యలతో తలమునకలై ఉన్న సమయంలో టమాటా సమస్య మరింత తలనొప్పిగా మారింది. రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ధారించడంలో విఫలమవుతున్నారని ప్రతిపక్షం కూడా విమర్శలు చేస్తోంది.


ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్‌లో ఆదివారం టమాటా ధర గరిష్టం రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉందని వివరించారు. పత్తికొండ మార్కెట్‌లో సాధారణంగా 30-40 మెట్రిక్ టన్నులు సరుకు చేరుతాయని, కానీ దసరా సెలవుల కారణంగా మరో 10 టన్నులు అదనంగా వచ్చాయని చెప్పారు. రోడ్లపై 2వ గ్రేడ్ టమాటాలను పోసి గందరగోళం సృష్టించారని, దీని వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం తెలుసుకుంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు.


రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరైన మార్కెట్ మద్దతు ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. మొత్తంగా, టమాటా ధరల పతనం రైతుల ఆర్థిక పరిస్థితిని కుదిపేస్తుండగా, ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలన్న ఒత్తిడి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: