ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై అన్నివర్గాల్లో సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎవరిని కదిపినా...వైసీపీదే విజయం అని స్పష్టం చేస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం కిందపడినా..తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఓ సంస్థను పేర్కొంటూ బోగస్ సర్వేను ప్రకటించి తన అనుకూల మీడియా ద్వారా ప్రచారంలో పెట్టిది. అయితే, దీనిపై ఆ సంస్థ భగ్గుమంది. తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అలా తెలుగుదేశం పార్టీపై మండిపడిన సంస్థ సెంటర్ ఫర్ సెఫాలజీ.
తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొంద నుందని వెలువడుతుఉన్న సర్వేతో తమకు సంబంధం లేదని సెంటర్ ఫర్ సెఫాలజీ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాలరావు తెలిపారు. తమ సంస్థ పేరు ప్రఖ్యాతులను దెబ్బతీసేలా కొన్ని చానళ్లు ఏపీ అసెంబ్లీ ఫలితాలపై సర్వే కథనాలను ప్రసారం చేస్తున్నాయని, దీనిపై సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు. తెలుగు అలర్ట్.కామ్, తాజా 30 చానళ్లు తమ సంస్థ చెప్పినట్టుగా టీడీపీకి అన్వయించి కథనాలు ప్రసారం చేస్తున్నాయని తెలిపారు. ఏపీలో వైసీపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలున్నాయనే అంశంపై తమ సంస్థ చూచాయగా విశ్లేషణ చేసిందని, అంతేకానీ ఒక పార్టీకి అనుకూలంగా ఎక్కడా విశ్లేషణ చేయలేదని స్పష్టంచేశారు.
తమ సంస్థ సర్వేగా పేర్కొంటూ తప్పుడు కథనాన్ని ప్రసారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ మేరకు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ చానళ్లను, కథనాల ప్రసారాన్ని నిలిపివేయాలని ఫిర్యాదులో కోరినట్టు తెలిపారు. అసత్య కథనాలతో మైలేజ్ పొందాలనుకునే టీడీపీ ఎత్తుగడ అడ్డంగా బుక్కయినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.