ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇవి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక వంటి లాంఛనాలతో ముగియనున్నాయి. అసలు సిసలు సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 26 నుంచి ఆంధ్ర ప్రదేశ్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు దాదాపు ఇరవై రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
ఈ బడ్జెట్ సమావేశాలలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి వాదన జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య దాడులు, అవినీతిపై విచారణ వంటి అంశాలపై వాడి వేడి విమర్శలు మొదలయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని వైసీపీ మంత్రులు కుండబద్దలు కొడుతున్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశానికి వైసీపీ నేతలు చుక్కలు చూపించే అవకాశం ఉంది. 2014లో వైసిపి దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నా.. అధికార తెలుగుదేశం వారి గొంతు నొక్కేసింది. ఇప్పుడు అదే తెలుగుదేశం కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది. మరి వారికి వైసిపి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందో.. చూడాలి మరి..