ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో ఆర్టికల్ 370 రద్దు చేసారని భారత దేశ చరిత్రలోనే ఇది అవమానకరమైన రాజకీయ నిర్ణయమని.. గులాం నబీ ఆజాద్ లాంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికి జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు మద్దతుగా 370 ఓట్లు రాగా.. 70 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మరోపక్క అన్యాయంగా కాశ్మీర్ ని విభజించారని కశ్మీర్ కి చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు వీరంతా ఈ విభజనను ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు.. ? 370 రద్దుకు సంబంధించి పూర్తి నిర్ణయం మోదీదేనని స్వయంగా అమిత్ షానే చెప్పుకొచ్చాడు. అంటే మోదీ చేశాడు కాబట్టి.. కాంగ్రేస్ ఆమోదించట్లేదా..? లేక నిజంగానే కాంగ్రెస్ కి ఈ ఆర్టికల్ 370 రద్దు అనేది అస్సలు ఇష్టం లేదా..? ఇంతకీ కాంగ్రేస్ ఆరోపిస్తోన్న ప్రధాన ఆరోపణ చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదిస్తున్నారని.. సరే.. ఇదే నిజం అనుకుందాం.
మరి దాదాపు డెబ్బై సంవత్సరాలుగా చర్చలు జరిపించలేకపోయారా..? లేక చర్చలు జరుపుతూనే ఉన్నారా..? పాకిస్థాన్ అంటే కాంగ్రేస్ కి ఇష్టమా లేక సానుభూతా..? కేవలం పాక్ వల్లే కశ్మీర్ లో యువకులు ఇండియాకి వ్యతిరేఖంగా పని చేస్తున్నారనేది కాదనలేని నిజం. మరి అలాంటి పాక్ ఆటలు అరికట్టే నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వాన్ని అభినందించాలి. అసలు మోదీ చేసింది కరెక్టా..? లేక ప్రజాస్వామ్య పద్ధతులకు పూర్తి విరుద్ధమా అనే విషయం పక్కన పెడితే.. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం కశ్మీర్ భవిష్యత్ నే మార్చబోతుంది. ఇది అక్షర సత్యం. అయితే ఈ విషయం పై ఇంతవరకూ కాంగ్రెస్ డైరెక్ట్ గా తన అభిప్రాయాన్ని చెప్పలేదు. బిల్లు ఆమోదం సరిగ్గా జరగలేదు.. మోదీ ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఇలాంటి అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. ఆర్టికల్ 370 రద్దుకి తాము సపోర్ట్ చేస్తున్నామా.. లేదా అనేది స్పష్టం చేయడం లేదు.
బహుశా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీకి హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడిపోతుంది.. ఒకవేళ సపోర్ట్ చేస్తే తమకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు అయిన ముస్లిమ్స్ దూరమైయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి లెక్కల మధ్య కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంటే.. అక్కడ మోదీ మాత్రం పాక్ కి చమటలు పట్టిస్తున్నాడు.