తిక్క కుదిరితే.. ఏం చేస్తారు..? రోకళ్లు చుట్టాలని యాగీ చేస్తారు! ఇంతేనా? ఇప్పుడు ఇదే తరహా యాగీ చేస్తున్నాడు.. మన పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్! కంపు కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే.. ట్రంప్.. ఇప్పుడు కరోనా విషయంలోనూ దేశాన్ని కంపు కంపు చేస్తున్నాడు! ఇదంతా తెలిసిందేగా! కొత్తగా చెప్పేది ఏదైనా ఉందా? అంటే.. అక్కడికే వస్తున్నా.. ప్రపంచం మొత్తం నేను చెప్పిందే నడవాలంటాడు.. కొందరికి వెర్రి.. వెయ్యి విధాలుగా ఉంటే.. ట్రంప్గారు మాత్రం తనకు వెయ్యిన్కొక్కో విధం ఉందని బల్ల గుద్దుతారు! అదే ఇప్పుడు ఆయనను, మనోళ్లంతా ఆశల మోసులతో డాలర్ల వేటకు వెళ్లే.. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది.
కరోనా వస్తోంది.. కాచుకోలేం.. తలుపులు మూసేసుకుందాం! అని ప్రతిపక్షాలు అదే డెమొక్రాట్లు పట్టుబ డితే.. మీకు చేతకాదు.. మందెక్కువైంది.. తాగింది దిగలేదు.. అందుకే పిచ్చి పిచ్చి సలహాలు.. సూచనలిస్తున్నారు.. తలుపులు మూయడం ఏంటి డామిట్..! అదేమన్నా భయంకర రాకాసా? అంటూ.. వారిపై నోరు పారేసుకున్న ట్రంప్.. తర్వాత కరోనా విజృంభణతో తలబాదేసుకున్నారు. దాదాపు రెండు లక్షలకు పైగానే కరోనా కాటుకు బలవుతారని మొదట్లో అన్నవారిని, మీడియాను కూడా నోటికి వచ్చినట్టు తిట్టిపోసిన ట్రంప్.. తర్వాత అందరూ చెప్పినట్టు రెండు లక్షలు కాదుగానీ.. ఓ 60 వేల వరకు హతమయ్యే ఛాన్స్ ఉందని ఒప్పుకొని తన తప్పులు చెప్పేశాడు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారంటారే.. అలాంటోళ్లు మనదగ్గరే ఉంటారని అనుకుంటే పొరపాటేనని ట్రంప్ ను చూశాక తెలిసిపోయింది. అమెరికా అంటుకున్నాక నీళ్ల కోసం వెతుకుతున్నాడు. అంతేకాదు, ఆయనదంతా డిఫరెంట్ స్టయిల్. ముందు కాదని, తర్వాత ఔననే బాప తు! ముందు లాక్డౌన్ అంటే.. దేశద్రోహులు.. నన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు! అయినా మన దగ్గరున్న వైద్యులు, సిబ్బంది బోల్డు మందున్నారు. వాళ్ల ముందు కరోనా తోక ముడవాల్సిందే! ఇంత మాత్రానికి ఆర్ధిక వ్యవస్థను ఆపేస్తారా? తలుపులు మూసేస్తారా? ప్రపంచం ముందు తలదించుకుంటారా? అంటూ.. నిప్పులు చెరిగిన ఆయనే తర్వాత వాటిపై తనంతట తానే నీళ్లు పోసుకున్నాడు. కానీ, ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రైట్ నౌ.. పరిస్థితి ఏంటంటే.. ప్రపంచంలో కరోనాను పుట్టించిన చైనా కంటే చావుల్లో చెలరేగిపోతోంది. అమెరికాలో మరణ మృందంగం ఆగడం లేదు. కరోనా దెబ్బకు ఇంతవరకు 30,985 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రపంచంలో ఇన్ని మరణాలు మరే దేశంలోనూ లేవని తెలిపింది. గత 24 గంటల్లోనే 2,569 మంది మృతిచెందారని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఇంత మంది చనిపోవడం రికార్డు అనేది కూడా విన్నవించింది. అగ్రరాజ్యంలో మొత్తంగా 6,39,664 మందికి వైరస్ సోకిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్-19 వైరస్ ఆవిర్భావానికి సంబంధించి నిజానిజాలు వెల్లడించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనాను కోరారు. ఆయన చైనా విదేశాంగ డైరెక్టర్ యాంగ్ జీచీకి ఫోన్ చేశారు.
ఈ ఫోన్లు.. భోగట్టా మాట ఎలా ఉన్నా.. న్యూయార్క్, న్యూజెర్సీల్లో శవాలు పూడ్చేందుకు రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది. ఇంత జరుగుతుంటే.. తిక్కశంకరయ్య ను మించిన ట్రంప్ మరో సారి చెలరేగిపోయారు. దేశంలో ఇప్పుడు గడిచిన రెండు వారాలుగా అమల్లో ఉన్న లాక్డౌన్ను ఎత్తేస్తానని ప్రకటించారు. నిజానికి ఇక్కడ కేసులు తగ్గుముఖం పట్టినా.. వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గలేదు. దీంతో ఇక్కడి గవర్నర్లు(మనకి సీఎంలు ఎలాగో.. అమెరికాలో గవర్నర్లు అలా).. నీకో దణ్ణం పెడతాం.. ఆ ఒక్కటీ చేయొద్దు! అన్నారు. కానీ, మన ట్రంప్ వింటాడా? ఒక్కసారిగా అప్పుడప్పుడు మన దగ్గర వినిపించే రాజ్యాంగం అంటూ కొత్త వాదన తెచ్చారు.
రాజ్యంగం నాకు విశేష అధికారాలు ఇచ్చింది కాబట్టి.. నేను చెప్పిందే వినాలని అన్నారు. కానీ, గవర్నర్లు గా మాకు కూడా అదే రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చిందని అక్కడివారు తిరగబడుతున్నారు. నిజానికి దేశంలో కరోనా కల్లోలం కట్టలు తెగుతోందని తెలిసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. తన పక్షాన నిలవలేదని, కరోనా పుట్టుకకు కారణమైన చైనాను ప్రశ్నించలేదని ఆక్షేపిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపేశాడు. మాకు హైడ్రాక్సీ క్లోరో క్విన్ మాత్రలు ఇవ్వండి అని భారత్ను అడిగాడు.. అరె మాదగ్గర అన్ని మాత్రలు లేవు.. అయినా మా అవసరాలు మాకుంటాయిగా అని భారత్ అనేసరికి.. మొహం మొత్తం చిట్లించి.. ఛీ.. భారత్ ద్రోహి! మిత్రదేశంగా అది పనికిరాదన్నాడు.
ఆ వెంటనే మన మోడీ ఏమనుకున్నాడో.,. వెంటనే 40 లక్షల మాత్రలు పంపాడు.. వెంటనే ట్రంప్.. భారత్ కు మిత్రదేశాల్లో ప్రముఖ స్థానం ఇస్తున్నాం.. అని అదే నోటితో అనేశాడు. ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థ పేరు చెప్పి.. కరోనా భూతం కరాళ నృత్యం చేస్తున్నా.. లాక్డౌన్ లేదు గీక్ డౌన్ లేదంటూ. మరోసారి తిక్క చేష్ఠలకు దిగిపోయాడు. దీంతో ఇప్పుడు అగ్రరాజ్యంలో ఎవరి మాట చెల్లుతుందా? అని ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. అందుకే ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్లంతా ట్రంప్కు తిక్కరేగింది... రోకళ్లు సిద్ధం చేసేయమంటున్నారు!!