గత కొన్నిరోజులుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు
చినజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ఉండే విగ్రహాలకు రక్షణ కొరవడిందని ఆయన అన్నారు. అంతర్వేది రథం దగ్ధం,
రామతీర్థం ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరు
జిల్లా సీతానగరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 50కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని.. ఈ రోజు సింగరాయకొండలో మరో ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్లు తెలిసిందన్నారు. దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై స్వామీజీ కార్యాచరణ ప్రకటించారు. ధనుర్మాస దీక్ష ముగియగానే ఈ నెల 17 వ తేదీ నుంచి దాడులకు గురైన ఆలయాలను సందర్శించనున్నట్లు
చినజీయర్ స్వామి ప్రకటించారు. దాడులకు గురైన ఆలయాలను పరిశీలించి.. ప్రతినిధులు, ప్రజలతో మాట్లాడతామన్నారు. ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు ఉందని.. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని
చినజీయర్ స్వామి అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఆలయాల వద్ద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దేవాలయల ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరిపించాలని.. ఎవరు తప్పు చేసినా నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా కమిటీ ఉండాలని ఆయన కోరారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై కేవలం మఠాధిపతులే కాదు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. మతపరమైన విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని.. రాజకీయం.. ఆధ్యాత్మికం రెండు వేరని
చినజీయర్ స్పష్టం చేశారు. చర్చి, మసీదులపై దాడులు జరిగినా ఈ విధంగానే స్పందిస్తామని ఆయన అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలపై యాత్రను వాయిదా వేసుకున్నామని.. 17 నుంచి
యాత్ర చేపట్టనున్నట్లు స్వామీజీ చెప్పారు. తాము ప్రభుత్వానికి అనుకూలం కాదని.. అలాగని ప్రతికూలం కూడా కాదని స్వామీజీ తెలిపారు.