
పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్కోచ్ జాసన్ గిల్లెస్పీ గురించి తెలిసే ఉంటుంది. ఇతను కొన్నాళ్ల క్రితం తన హెడ్కోచ్ పదవి నుంచి వైదొలగడం జరిగింది. అయితే తాజాగా తన రాజీనామాపై గిల్లెస్పీ ఓ ఇంటర్నేషనల్ మీడియా వేదికగా స్పందించాడు. అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్ను తన పదవి నుంచి పీసీబీ తప్పించడంతో తన కూడా వైదొలగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ప్రపంచంలో పీసీబీ లాంటి క్రికెట్ బోర్డును తనకెక్కడా చూడలేదని, విమర్శలు గుప్పించాడు. అతను మాట్లాడుతూ... "పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో దారుణమైన రాజకీయాలు ఉన్నాయి. ఇటువంటి క్రికెట్ బోర్డును ఇంతకు మునుపు నేను చూడలేదు. ఏ హెడ్ కోచ్ అయినా తమ బోర్డుతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని అనుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ పీసీబీ తీరు మాత్రం దారుణంగా వుంది. తుది జట్టు ఎంపిక విషయంలో కూడా నాకు పూర్తి స్వేఛ్చ ఇచ్చేవారు కాదు. అందులో కూడా పీసీబీ జోక్యం చేసుకుంటుంది." అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ రెమ్యునరేషన్ విషయం అడగగా... తన జీతంలో కొంత భాగాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా చెల్లించనే లేదని ఆరోపించాడు. గిల్లెస్పీని ఏప్రిల్ 2024లో ఒక సంవత్సరం పాటు జాతీయ జట్టుకు రెడ్-బాల్ కోచ్గా నియమించిన సంగతి విదితమే. అయితే, పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా పేలవమైన ఫలితాలను అందించడంతో పరిస్థితులు తనకు అడ్డం తిరిగాయి. ఆ తర్వాత పీసీబీ ఎలాంటి చర్చలు లేదా ముందస్తు నోటీసు లేకుండానే ఆ మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ సహాయకుడిని తొలగించింది. పీసీబీ నిర్ణయం ఆస్ట్రేలియా పేసర్కు నచ్చక, అక్టోబర్ 2024లో తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
గిల్లెస్పీ ఇటీవల, పాక్పాషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు విషయాలు పంచుకున్నాడు. PCB తన జీతం క్లియర్ చేయలేదని, బోర్డు ఈ విషయాన్ని పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్లో ప్రధాన కోచ్గా తన పదవీకాలం కోచింగ్ పట్ల గిల్లెస్పీ విచారం వ్యక్తం చేసాడు. "పాకిస్తాన్లో నా అనుభవం అంతా వృధా ప్రయాస అయిపోయింది. ఇది నాకు చాలా పెద్ద దెబ్బ. విషయాలు ఎలా ముగిశాయో చూసి నేను తీవ్రంగా నిరాశ పాలయ్యాను. నేను పూర్తి సమయం కోచింగ్కు తిరిగి రావాలనుకుంటున్నానా లేదా అని కూడా ఇది నన్ను ప్రశ్నించేలా చేసింది!" అని ఆయన అన్నారు.