గత పది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పులకుంపటిగా మారిపోయాయి. భానుడు భగభగ మండుతూ నిప్పులు కక్కుతున్నాడు.. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటి ప్రజలను ముప్పతిప్పలు పెడుతోంది. ఇక బయటకు రావాలంటేనే పిల్లలు పెద్దలు అల్లాడిపోతున్నారు. ఇక అందుకే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకు రావాలని చెబుతోంది.. పగటి పూట ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు అని.. వచ్చినా సరే వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరిస్తోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండకు అల్లాడిపోతున్న నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం అనగా మే 19 నుండి 23వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు కూడా అప్రమత్తం కావాలి అని వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

బంగాళాఖాతం నుంచి రాయలసీమ కోస్తా జిల్లాల్లోకి గాలులు వీస్తున్నాయని.. ఈ ప్రభావంతో కోస్తాలోని పలు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం తో పాటు పలు జిల్లాలలో గాలి దుమారంతో కూడిన వర్షాలు పడునున్నాయట. దీంతో వేడి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కొద్దిగా చల్లటి గాలులతో ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు.  అయితే రైతులు ఎండా కారు పంటలు వేసుకున్నట్లయితే వారు అప్రమత్తంగా ఉండాలి అని.. పంటలను కాపాడుకోవాలి అని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: