వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గడ్ కోర్బాలోని ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దొంగను దేవుడే స్వయంగా శిక్షించాడు. అయితే దొంగతనం చేసేందుకు తన సహచరుడితో కలిసి సర్వం సిద్దమయిన దొంగ సరైన సమయం చూసుకుని ఆలయంలోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లిన అతడు తన చేతిని హుండీలోకి పెట్టాడు. అనంతరం అతడికి ఊహించని షాక్ తగిలింది. హుండీలో పెట్టిన చెయ్యి తిరిగి బయటకు రావడంలేదు. పెట్టిన చెయ్యి పెట్టినట్లే హుండీలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటికి తీసేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగలు చేయని ప్రయత్నాలు లేవు. కానీ ఫలితం లేకపోయింది.
కాగా.. తెల్లవారుజామున ఈ సంఘటన చూసిన స్థానికులు మొదట విస్తుబోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ విషయం విన్న స్థానిక ప్రజలందరూ కూడా తన ఇంట్లో పడిన దొంగలను దేవుడే పట్టించాడని, ఆ దొంగలకు భగవంతుడు సరైన శిక్ష విధించాడని అంటున్నారు. ఈ ఘటన కోర్బా నగరంలోని పవర్ హౌస్ రోడ్లో ఉన్న శ్రీ సిద్ధ వతేశ్వర్ హనుమాన్ శని ఆలయంలో చోటు చేసుకుంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.