విమానాలు ఒక్కసారి కదిలాయంటే ఇక మళ్ళీ ఆపటం అస్సలు కుదరదు అలాగే దారి మల్లించడం కూడా వీలవ్వదు. కేవలం చాలా అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే విమానాలను దారి మళ్లిస్తారనే విషయం తెలిసిందే. ప్రయాణికుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా, సాంకేతిక లోపాలు లేదా భద్రతా సమస్యలు తలెత్తినా విమానాలను సమీపంలోని విమానాశ్రయాల్లో అత్యవసరంగా దించేయడం జరుగుతుంది. అయితే, అమెరికాకు చెందిన ఓ విమానం మొబైల్ ఛార్జర్ కోసం విమానాన్ని దారి మళ్లించారు. ఇందుకు ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేసిన రచ్చే కారణం.


ఇక అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టోక్యో నుంచి డల్లాస్‌కు పయనమైంది. వాల్కా సుజుకీ అనే 26 ఏళ్ల మహిళ తనకు కేటాయించిన సీటులో మొబైల్ ఛార్జర్ పనిచేయడం లేదని ఫ్లైట్ అటెండర్‌కు చెప్పింది. తన ఫోన్‌ను అర్జంట్‌గా ఛార్జ్ చేయాలని అడిగింది. అయితే, అందుకు సాధ్యం కాదని, వెళ్లి సీట్లో కూర్చోండని ఫ్లైట్ సిబ్బంది తెలిపారు. దీంతో సుజుకీ కోపానికి గురైంది.


ఆమె కూర్చున్న సీటు నుంచి లేచి విమానం ముందు వైపుకు పరిగెట్టింది. సిబ్బందిపై దాడి చేసి వారి కాళ్లను తొక్కేసింది. ఇక అక్కడితో ఆగకుండా పైలెట్లు ఉండే కాక్‌పిట్ డోర్‌ను కొడుతూ.. తన ఫోన్ ఛార్జింగ్ చేసుకోవాలని అరిచింది. విమాన సిబ్బంది ఆమెను శాంతపరిచేందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు ఈ సమాచారం తెలిసింది. వెంటనే విమానాన్ని సీటెల్-టకోమా ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి మళ్లించాలని ఆదేశించడం జరిగింది.


 మహిళ దాడి చేసిన నేపథ్యంలో విమాన సిబ్బంది ఆమె చేతులకు ప్లాస్టిక్ సంకెళ్లు వేయడం జరిగింది.విమానం ల్యాండైనా దిగేందుకు ఆమె అంగీకరించలేదు. సుమారు 30 నిమిషాలపాటు ఆమె విమానంలోనే ఉంది. సీటెల్ పోలీస్, అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగారు. ఆమెను విమానం నుంచి కిందికి దించి విచారించారు. ఈ సందర్భంగా ఆమె విమాన సిబ్బందిపై ఆరోపణలు చేసింది. వారు తనపై దురుసుగా ప్రవర్తించడం వల్లే తాను ఆగ్రహంతో దాడి చేశానని తెలిపింది. ఈ ఘటన చోటుచేసుకున్న విమానంలో 13 మంది విమాన సిబ్బంది, 60 మంది ప్రయాణికులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: