కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్ననేపథ్యంలో అన్నిరంగాల కార్యకలాపాలు ఆగిపోయాయి. పాఠశాలలు నిర్వహించే అవకాశం లేదు. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
నిజానికి.. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. లాక్డౌన్ విధించిన తర్వాత నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దానికి సంబంధించిన ఉత్తర్వలను తాజాగా విడుదల చేసింది విద్యాశాఖ. ఇక పదోతరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతుండగా.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. లాక్డౌన్ ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని అధికారులు సూచించారు.