రాజకీయాలన్నాక ఎంతోమంది నేతలు వస్తుంటారు,  పోతుంటారు. కానీ కొందరు మాత్రమే జనహ్రుదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోతారు.  తెలుగు రాజకీయాల్లో  గడచిన, ప్రస్తుత జనరేషన్ కు సంబంధించి జనహ్రుదయాల్లో నిలిచిపోయిన నేత ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే చెప్పాలి. రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించినా బాగా పాపులరైన సిఎంగా, వివిధ వర్గాల్లో బాగా నాటుకుపోయిన నేతగా  మొదట్లో తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ ఉండేవాడు. అయితే ప్రస్తుత తరానికి ఎన్టీయార్ అంటే కేవలం జూనియర్ ఎన్టీయార్ మాత్రమే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఎన్టీయార్ మరణించి దాదాపు పాతికేళ్ళయిపోయింది కాబట్టి కచ్చితంగా ఇప్పటి తరంలో చాలామందికి ఎన్టీయార్ అంటే ఎవరో తెలీదు. అదే సమయంలో డాక్టర్ వైఎస్సార్ మాత్రం గడచిన, ప్రస్తుత తరానికి బాగా సుపరిచితుడనటంలో సందేహం లేదు. ఎందుకంటే వైఎస్సార్ మరణించి 11 ఏళ్ళు మాత్రమే అవ్వటం, మరణించిన విధానం, జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న సంచలనాలతో వైఎస్సార్ ను జనాలు మరచిపోలేకున్నారు.




దాదాపు నలబై సంవత్సరాలుగా వైఎస్సార్ రాష్ట్ర రాజకీయాల్లో అసమ్మతి కార్యక్రమాల కారణంగానే బాగా పాపులరయ్యాడన్నది వాస్తవం. వైఎస్సార్ కన్నా బాగా సీనియర్లు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో  వైఎస్స్ నిత్యమూ ఏదో ఒక అసమ్మతిని రాజేస్తునే ఉండేవాడు. దాంతో సమైక్య రాష్ట్రంలో పై నేతలంటే పడని వారికి వైఎస్ ఓ ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అందుకనే అప్పట్లో రాష్ట్రంలోని ఏమూలకు వెళ్ళినా వైఎస్ కు మద్దతుదారులుండేవారు. అలా అలా మద్దతుదారులను పెంచుకుంటూ వెళ్ళాడు. చివరకు సీనియర్లందరు ఒకరి తర్వాత మరొకరు కాలధర్మం చెందే సమయానికి కాంగ్రెస్ లో వైఎస్ కు తిరుగులేకుండా పోయింది. అదే సమయంలో వైఎస్ కు కూడా కొందరు వ్యతిరేకులుగా తయారయ్యారు. తన వ్యతిరేకులను నిలువరించటంలో పార్టీలో తన ఉనికిని ఘనంగా చాటుకుని తిరుగులేని నేతగా ఎదిగేందుకే వైఎస్సార్ పాదయాత్రను చేశాడు.




వైఎస్ పాదయాత్ర పూర్తి చేయటం, చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత పెరిగిపోవటం, ఎన్నికలు రావటం.. అంతా కలిసి వైఎస్ కు జనాల్లో ప్రత్యేకమైన ఇమేజిని తెచ్చిపెట్టాయి. దాని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటితో 2004లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేయాలనే చాయిస్ అధిష్టానానికి లేకుండా కేవలం తాను తప్ప మరో ఛాయిస్సే లేదనే పరిస్ధితులు కల్పించటంలో  వైఎస్ సక్సెస్ అయ్యాడు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ శఖం ఆరభమైనట్లయ్యింది. సిఎం అయినప్పటి నుండి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకున్నాడు.  సంక్షేమ కార్యక్రమాలు ఎన్నున్నా  ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్, ఉచిత వ్యవసాయ విద్యుత్ అనగానే వైఎస్సారే గుర్తుకొస్తాడు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ప్లానింగ్, శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం-ప్రారంభోత్సవం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, జలయజ్ఞం లాంటి అభివృద్ధి కూడా వైఎస్ హయాంలోనే జరిగింది.




ఇదే సమయంలో వైఎస్ పై అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా ఆయన ఇమేజికి ఏమాత్రం డ్యామేజి కాలేదు. ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్, జలయజ్ఞం లాంటి కార్యక్రమాల అమలు ముందు అవినీతి ఆరోపణలు కొట్టుకుపోయాయి. అందుకనే 2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. రెండోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అప్పటి ప్రతిపక్షాల నేతలు చంద్రబాబునాయుడు, కేసీయార్, వామపక్షాలు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దాంతో ప్రత్యేక తెలంగాణా వాదన కూడా గాలికి కొట్టుకుపోయింది. అంటే 2009 ఎన్నికల నాటికి పార్టీలోనే కొందరు తెలంగాణా నేతలు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే వైఎస్ ఇమేజి  ముందు వాళ్ళ ఆటలు సాగలేదు. పైగా రెండోసారి కూడా అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ నేతలతో పాటు కేసీయార్ నోరు కూడా మూతపడిపోయింది.




అయితే అనూహ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించటంతో వైఎస్ వ్యతిరేకులంతా ఏకమైపోయారు. వైఎస్ చనిపోవటం వల్లే రాష్ట్రం విడిపోయిందని లేకపోతే ఎప్పటికీ ఏపి సమైక్యంగానే ఉండేదని నమ్మేవాళ్ళు ఇప్పటికీ కోట్లలోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  ఇవన్నీ పక్కనపెడితే ప్రజలతో వైఎస్ మమేకమయిన తీరు, ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించిన విధానం, ఎటువంటి వారినైనా రిసీవ్ చేసుకునే పద్దతి, ఇంటా బయట తన శతృవులందరినీ మిత్రులుగా చేసుకోవటం లాంటి అనేక చర్యల వల్ల వైఎస్సార్ అంటే జనాలతో పాటు పార్టీలో కూడా తిరుగులేని నేతగా ఎదగటానికి అవకాశం వచ్చింది. ఏ మూలకు వెళ్ళినా ఓ వందమందిని పేరుపెట్టి పలకరించేంత చనువు, చొరవ ఉండటం వైఎస్ లోని ప్రత్యేక లక్షణం. ఇటువంటి అనేక లక్షణాలు కలగలిపి వైఎస్సార్ ను తెలుగు రాష్ట్రాల్లో మహానేతగా జనహ్రుదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయేట్లు చేసిందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: