ఈ కార్నర్ మీటింగ్స్ లో అయ్యే ఖర్చు తక్కువ. ఏదైనా బస్సు మీద నిలబడి మాట్లాడినా సరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకించి స్టేజీలు నిర్మించాల్సిన అవసరం ఉండదు. చాలా ఖర్చులు తగ్గుతాయి. మహా అయితే జనాలను తీసుకువచ్చిన వారికి 200 ఇస్తే సరిపోతుంది. ఈ మీటింగులకు జనాలు ఫలానా నాయకుడి ప్రసంగం వినాలని రారు. మహా అయితే ఆ మీటింగ్ కి తమను తీసుకువచ్చిన వారిని సంతృప్తి పరచడానికి మాత్రమే వాళ్లు వస్తారు అంతే. కానీ ఎలా వచ్చినా కార్నర్ మీటింగ్స్ లో జనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి తొక్కిసలాటలో జనాలు ప్రాణాలను కోల్పోతూ ఉంటారు.
ఇలాంటి సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే చిన్న సందులో పెట్టే కార్నర్ మీటింగ్స్ కు పోలీసులుఅనుమతి ఇవ్వకూడదు. విశాలమైన మైదానాల్లో, పెద్ద రోడ్ల పైన మీటింగులు నిర్వహించాలనుకుంటేనే అనుమతులు ఇవ్వాలి. లేదా ఇండోర్ స్టేడియంలో కూడా మీటింగ్ నిర్వహించడానికి అనుమతులు ఇవ్వచ్చు. రోడ్ షోలకు కూడా ప్రాబ్లం ఉండదు. అది కూడా వాళ్ళు నిలబడి ప్రసంగాలు చేయకపోతే.. ఇక్కడ ఫలానా వ్యక్తి చంద్రబాబు వల్ల లేదా మరొకరు వల్ల ప్రాణ నష్టం జరిగిందని చెప్పడం కాదు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా ఏం చేయాలనే అంశంపై అగ్రనేతలంతా ఆలోచించాలి. ప్రాణనష్టం నివారించాలి.