మాజీ ప్రధాని పీవీ ఈ దేశానికి చాలా చేశాడు.. మరి పీవీ కోసం ఈ దేశం ఏం చేసింది.. ఆయనకు దేశ నేతలు ఎలా స్మరించుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పీవీకి ఏం చేసింది.. ఎందుకంటే.. పీవీ నరసింహారావు జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగానే కొనసాగారు. కాంగ్రెస్ వ్యక్తిగానే చనిపోయారు. మరి అంతటి వ్యక్తికి కాంగ్రెస్ ఏం చేసిందో గుర్తు చేసుకుంటే తీవ్ర ఆవేదన కలగక మానదు. పీవీ చనిపోయిన సమయంలో కనీసం ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో చేసే అవకాశం కూడా కల్పించలేదు.


పీవీ మరణించినప్పుడు హుటాహుటిన ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. కనీసం హైదరాబాద్‌లోనైనా అంత్యక్రియలు పద్దతిగా జరిగాయ అంటే అదీ లేదు. ఆయన దేహం పూర్తిగా బుగ్గి కాకముందే అక్కడి నుంచి అంతా వెళ్లిపోయారు. పీవీ మరణించిన సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంది. అయినా పీవీని గౌరవించుకునే పని ఏమాత్రం చేయలేదు. చివరకు హుస్సేన్ సాగర తీరంలో ఆయన సమాధి స్థలాన్ని పీవీ ఘాట్‌గా ప్రకటించి చేతులు దులుపుకున్నారు.


ప్రధాని స్థాయిలో సేవలందించిన తెలుగు వ్యక్తిని ఆనాటి సీఎం వైఎస్‌ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే పీవీ అంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు.. ముఖ్యంగా సోనియాకు గిట్టదు. అందుకే పీవీని గౌరవించుకునే సాహసం చేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోని నేత గురించి బీజేపీ పట్టించుకుంటుందని ఆశించడం వృథా. అయితే ప్రధాని మోడీ కొందరు నేతల విషయంలో పార్టీల గురించి పట్టించుకోకుండా గౌరవించారు. ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను నెత్తిన పెట్టుకున్నారు. కానీ.. పీవీ గురించి మాత్రం పట్టించుకోలేదు. పీవీకి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ అలాగే ఉండిపోయింది.


ఇక పీవీ గురించి ముందు తరాలకు తెలియజెప్పాలన్న ప్రయత్నం కేసీఆర్ మాత్రమే చేయగలిగారు. తెలంగాణ బిడ్డ పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. పీవీ ఘాట్‌ను అభివృద్ధి చేశారు. అక్కడ పీవీ విగ్రహాన్ని నెలకొల్పారు. నెక్లెస్‌ రోడ్ ను పీవీ మార్గంగా ప్రకటించారు.  ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. ఆయనపై 9 పుస్తకాలు తీసుకొచ్చారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

PV